శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. దక్షిణ కశ్మీర్లోని షోపియాన్ జిల్లా చిత్రగామ్లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
బుధవారం సాయంత్రం చిత్రగామ్లో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. దీంతో ఓ పౌరుడు గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున గాలింపు బృందాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది చనిపోయాడని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. అతడిని అనాయత్ అహ్మద్ దార్గా గుర్తించామన్నారు. అతని వద్ద ఒక పిస్తోల్, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.