చెన్నై : తమిళనాడులోని శివకాశి శివారులోని జమీన్సల్వార్పట్టి పటాకుల కర్మాగారంలో శనివారం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మృతదేహం ఎగిరి సమీపంలో ఉన్న చెట్టుపై పడింది. విరుదునగర్ జిల్లాల్లో ఉన్న శివకాశి ప్రాంతంలో పెద్ద ఎత్తున బాణాసంచ కర్మాగారాలున్నాయి. కరోనా లాక్డౌన్ సడలింపులు ప్రకటించిన నెల తర్వాత ఫ్యాక్టరీలో పటాకుల తయారీ పనులు కొనసాగుతున్నాయి. శనివారం ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలోని మిక్సింగ్ ఛాంబర్లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే, పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లను సంఘటనా స్థలానికి తరలించి, మంటలను అదుపులోకి తీసుకువస్తున్నారు.
పేలుడు ధాటికి చాంబర్లో ఉన్న కార్మికుడు మృతి చెందగా.. మృతదేహం ఎగిరి చెట్టుపడింది. ఫైర్ సిబ్బంది మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందకుదించారు. పేలుడు సమయంలో 30 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని, కారణాలు ఆరా తీశారు. దీపావళి పండుగకు కొద్ది నెలలే సమయం ఉన్నందున కర్మాగారాల్లో బాంబుల తయారీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే, ఇటీవల వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు నెలల్లో ఫ్యాక్టరీల్లో పేలుడు సంభవించి 40 మందికిపైగా మరణించారు. ఫిబ్రవరిలో అచ్చంకుళంలోని ఓ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.