భోపాల్: రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న భోపాల్, ఇండోర్, జబల్పూర్ పట్టణాల్లో 24 గంటల పాటు లాక్డౌన్ను అమలు చేస్తున్నది. ఇకనుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ మూడు పట్టణాల్లో ప్రతి ఆదివారం లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. దీంతోపాటు శనివారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఈనెల 31 వరకు స్కూళ్లు, కాలేజీలతోపాటు అన్నిరకాల విద్యాసంస్థలు మూసి ఉంటాయని వెల్లడించారు.
ప్రజలు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కోరారు. కరోనా వ్యాప్తిని తగ్గించడానికి మాస్కులు విధిగా ధరించాలని విజ్ఞప్తిచేశారు. కాగా, రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 1308 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,74,405కు చేరింది. ఇందులో 3903 మంది మరణించారు.