తిరువనంతపురం: కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతున్నది. గత నెల రోజులుగా 20 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల సంఖ్యలో మరణాలు రికార్డవుతున్నాయి. అయితే మొహర్రం, ఓనమ్, రక్షాబంధన్ వంటి వరుస పండుగ సెలవుల నేపథ్యంలో కరోనా కేసులు మరోసారి రికార్డు స్థాయికి పెరిగాయి. ఈ ఏడాది మే 20 తర్వాత మరోసారి వైరస్ కేసులు 30 వేల మార్కును దాటాయి. మంగళవారం నుంచి బుధవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 31,445 కరోనా కేసులు, 215 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 38,83,429కు, మొత్తం మరణాల సంఖ్య 19,972కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో 20,271 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు కేరళ ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 36,92,628కు చేరుకున్నదని, ప్రస్తుతం రాష్ట్రంలో 1,70,292 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా హాట్స్పాట్గా కేరళ కొనసాగుతున్నది. ఆ రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 19 శాతంపైగా ఉన్నది.