న్యూఢిల్లీ: పార్లమెంటులో తొలిసారి పాత సంప్రదాయానికి విపక్షాలు తూట్లు పొడిచాయని రాజ్యసభ నాయకుడు పియూష్ గోయల్ ఆరోపించారు. కొత్త కేబినెట్ ఏర్పడినప్పుడు లేదా పునర్నిర్మాణం జరిగినప్పుడు మంత్రులను పార్లమెంటు సభ్యులకు ప్రధాని పరిచయం చేయడం మంచి సంప్రదాయమని అన్నారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు ఈ రోజు దీనికి అంతరాయం కలిగించారని ఆయన విమర్శించారు. మొదటిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో మహిళలు, గిరిజనులు, ఈశాన్య ప్రజలు కేంద్ర మంత్రివర్గంలో భాగమయ్యారని గోయల్ తెలిపారు. సమాజంలోని వెనుకబడిన వర్గానికి చెందిన వారిని పెద్ద సంఖ్యలో ప్రధాని మోదీ తన కేబినెట్లోకి తీసుకోవడాన్ని ప్రతిపక్ష ఎంపీలు సహించలేకపోతున్నారని విమర్శించారు.
కేబినెట్ మంత్రులుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఓబీసీలు, దళితులు, ఎస్సీ-ఎస్టీలు, ఈశాన్య రాష్ట్రాల ప్రతినిధులు, మహిళలను ప్రధానమంత్రి సభకు పరిచయం చేసే విధానానికి విపక్షాలు అంతరాయం కలిగించడం దురదృష్టకరమని గోయల్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష ఎంపీలు ప్రజాస్వామ్య ప్రక్రియను నిలిపివేశారని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని, దేశ ప్రజలను అవమానించడమేనని మండిపడ్డారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజు ఉభయ సభల్లో ప్రతిపక్ష ఎంపీలు ప్రవర్తించిన విధానాన్ని తాము ఖండిస్తున్నామని అన్నారు. రాజ్యసభలో చైర్మన్ ప్రసంగాన్ని కూడా విపక్షాలు అడ్డుకున్నాయని, ఇది చాలా దురదృష్టకరమని గోయల్ విమర్శించారు.