వెల్దుర్తి, ఏప్రిల్ 16 : గోదావరి జలాల మళ్లింపుతో హల్దీవాగు, మంజీరా నది జీవ నదులుగా మారాయిని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. బీడుభూములకు గోదావరి జలాలను రావడంతో రాష్ట్రంలో 53 లక్షల ఎకరాల్లో వరి సాగుతో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచిందని తెలిపారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హల్దీవాగు ప్రాజెక్టు గోదావరి జలాలతో నిండి అలుగు పారడంతో శుక్రవారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, నర్సాపూర్, మెదక్ ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, ఇఫ్కోడైరెక్టర్ దేవేందర్రెడ్డి, కలెక్టర్ హరీశ్తో కలిసి మంత్రి గంగమ్మకు పూజలు చేసి చీర, సారెలను సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో నదులకు అడ్డంగా, వాగులపై ప్రాజెక్టులు కట్టగా నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రాంత రైతుల కోసం ఎలాంటి నదులు, వాగులు లేని ప్రాంతాల్లో మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ను నిర్మించి, గోదావరి జలాలతో నింపి కాలువల ద్వారా నీటిని తరలిస్తున్నారని చెప్పారు. 70ఏండ్ల పాలనలో గత ప్రభుత్వాలు మంజీరాపై ఒక్క చెక్డ్యాంను నిర్మించలేదని.. తెలంగాణ వచ్చాక ఏడేండ్లలోనే మూడు చెక్డ్యాంలు నిర్మించి, నీటి నిల్వలు పెంచుకున్నామని స్పష్టంచేశారు. హల్దీవాగు ప్రాజెక్టు అలుగుపారడంతో హల్దీ, మంజీరాల్లో నీళ్ల ప్రవాహంతో నర్సాపూర్, మెదక్ నియోజకవర్గాల్లోని చాలా గ్రామాలకు సాగు, తాగునీటికి శాశ్వంతంగా పరిష్కారం దొరికిందని, రెండు నదుల పరీవాహక ప్రాంతం సస్యశ్యామలం కానుందని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.