పిల్లలూ! నీటిలోని చేపలు ఎన్నో రకాలు ఉంటాయి. ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేక లక్షణం ఉంటుంది. ‘పిరానా’ అని పిలిచే చేపకు అన్నిటికన్నా ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. అది మనుషుల్లా మొహంలో రకరకాల భావాలను వ్యక్తపరుస్తుంది. పదునైన పళ్లు ఉంటాయి. ఎప్పుడూ ఆకలితో ఉంటుంది. చాలా సార్లు పిరానా చేపలు గుంపులు గుంపులుగా వెళ్లి ఇతర ప్రాణుల మీద దాడి చేస్తాయి. ఇవి తమలో తాము మాట్లాడుకుంటాయని ఆ చేపల మీద పరిశోధన చేసిన శాస్త్ర
వేత్తలు తెలిపారు. కొన్ని ధ్వనుల ద్వారా భావాలను వ్యక్తీకరించుకుంటాయని కూడా కనిపెట్టారు. అవి చేసే శబ్దాలను బట్టి వాటి ప్రవర్తనలను అర్థం చేసుకోవచ్చు. కోపాన్ని, అసహనాన్ని, హెచ్చరిక ధోరణిని తెలిపేలా ధ్వనులు చేస్తాయి. వీటిని పెద్ద అక్వేరియంలో పెట్టి.. అందులో సున్నితమైన శబ్దాలను సైతం నమోదు చేసే పరికరాలను, వీడియో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఏ సందర్భాల్లో ఎలాంటి శబ్దాలు చేస్తున్నాయో, ఆ శబ్దాలు విని మిగతావి ఎలా స్పందిస్తున్నాయో విశ్లేషించారు. ఈ ధ్వనులను నోటితో కాకుండా, కొన్ని కండరాలను కదిలించడం ద్వారా చేస్తున్నాయని తెలుసుకున్నారు.
చేపల్లో భావ ప్రకటన ఉంటుందని ముందే తెలిసినా, ఇంత కచ్చితంగా తెలుసుకోవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. దక్షిణ అమెరికాలోని మంచి నీటి చెరువుల్లో పిరానా చేపలు కనిపిస్తాయి. వీటి పళ్లు పదును దేలి గట్టిగా ఉండడంతో పాటు, ఇవి గుంపులుగా తిరుగుతూ ఆహారాన్ని వేటాడతాయి. ఏ జలచర జీవి అయినా దొరికితే క్షణాల్లో తినేస్తాయి. వీటి పళ్లతో ఆయుధాలు చేస్తారు.