పెద్దపల్లి : రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గురువారం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 10 వ వార్డు రంగంపల్లిలో నిర్మిస్తున్న నూతన సఖీ కేంద్ర భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.45 లక్షల వ్యయంతో సఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆరు నెలల్లోనే భవన నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.
ప్రభుత్వం మహిళా హెల్ప్ లైన్ 181 ను ప్రారంభించిందని పేర్కొన్నారు. మహిళల అక్రమ రవాణాను నివారించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. మహిళల సమస్యల పరిష్కారానికి సఖీ కేంద్రాలు అనేక విధాలుగా ఉపయోగపడుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్ది, పలువురు జడ్పీటీసీలు పాల్గొన్నారు.