రామగిరి, జూన్ 11 : బడిబయటి పిల్లలంతా బడుల్లోనే ఉండాలనే సంకల్పంతో విద్యాశాఖ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఇప్పటికే బడిబయటి పిల్లలను గుర్తించి సమీపంలోని బడుల్లో చేర్పిస్తున్నది. పాఠశాల విద్యాశాఖ – సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2020-21 విద్యా సంవత్సరంలో 960 మంది బడిబయటి పిల్లలను గుర్తించింది. కరోనా నేపథ్యంలో ఇంకా ఎవరైనా బడిమాని బాలకార్మికులుగా ఉన్నారా? అనే కోణంలో క్లస్టర్స్ రిస్సోర్స్పర్సన్స్(సీఆర్పీలు) ఇంటింటి సర్వేతో పునఃపరిశీలన చేస్తున్నారు. గుర్తించిన పిల్లలను ఈ నెల 15లోగా ఎంఆర్సీ ద్వారా చైల్డ్ ఇన్ఫో వెబ్సైట్లో నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2021 సంవత్సరాన్ని ఎండ్ చైల్డ్ లేబర్ నినాదంతో ప్రభుత్వం- విద్యాశాఖ పనిచేస్తున్నది. నేడు అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేకం.
బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తున్న సంస్థలు
అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆదేశాలతో శిశు సమగ్ర అభివృద్ధి, ఆపరేషన్ బ్లాక్బోర్డ్, సమగ్రశిక్ష(సర్వశిక్ష అభియాన్) ద్వారా బాలకార్మిక వ్యవస్థపై వచ్చే ఫిర్యాదులను మహిళా శిశు సంక్షేమ శాఖ పరిష్కరిస్తుంది. అంగన్వాడీ, పోలీసు, కార్మిక శాఖలు కూడా దీనిలో భాగస్వామ్యం అవుతున్నాయి. 2015లోనే బాలకార్మిక నిర్మూలనకు ‘ఆపరేషన్ స్మైల్’ పేరుతో కార్యక్రమాలు చేపట్టారు. కొవిడ్ కారణంగా ప్రజల ఆర్థిక స్థితి క్షీణిస్తున్న ప్రస్తుత తరుణంలో బాలకార్మికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీని నివారణకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని పలువురు విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు.
యాదాద్రి జిల్లాలో ఎక్కువ
కరోనా కాలంలో పాఠశాలలు నడవలేదు. అంతా ఆన్లైన్లోనే చదువులు సాగాయి. అయితే ఆన్లైన్ తరగతులకు మొబైల్ ఫోన్స్ అందుబాటులో లేక, ఇంటర్నెట్ సౌకర్యంలేక ఇబ్బంది పడ్డ విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ నల్లగొండ యూట్యూబ్ చానల్ ద్వారా తరగతులు అందుబాటులోకి తెచ్చింది. కరోనా వేళ మరికొంత కాలం ఇలానే బోధన సాగనుంది. ఈ ఏడాది జనవరి, మే నెలలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం 960మంది బడిబయటి పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. వీరిని బడిలో చేర్పించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటున్నది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోనే బడి బయటి పిల్లలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇంకా ఎవరైనా బడిబయటి పిల్లలు ఉంటే గుర్తించి 6-14 పిల్లలు, 15 నుంచి 19 ఏండ్ల యువకుల వివరాలను ప్రత్యేక ఫార్మాట్స్లో నమోదు చేసి అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
బడిబయటి పిల్లలను గుర్తిస్తున్నాం..
ప్రతి సంవత్సరం బడిబయటి పిల్లలను గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నాం. ఇప్పటికే కొంతమందిని గుర్తించగా ఇంకా ఎవరైనా ఉంటే పరిశీలించేందుకు ఇంటింటి వివరాలు సేకరిస్తున్నాం. ఈ నెల 15లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించాం. అందరికీ విద్య, సర్కారు బడుల్లో మెరుగైన బోధన జరుగాలనే సర్కారు సంకల్పానికి అనుగుణంగా పనిచేస్తున్నాం.