రూపం స జగృహే మాత్స్యం చాక్షుషోదధి-సమ్ప్లవే
నావ్యారోప్య మహీమయ్యామపాద్వైవస్వతం మనుమ్ ॥
సాధారణంగా పశుజీవనమన్నది లోకంలో ఎంతో హేయమైందిగా చెప్తారు. గత జన్మల పాపకర్మల ఫలితంగానే జీవుడు బలవంతంగా పశురూపాన్ని పొందవలసి రావచ్చు. కానీ, భగవంతుని జన్మ, కర్మలు మాత్రం ఎంతో దివ్యమైనవి. ఆది శంకరాచార్యులంతటి వారే ‘నారాయణ పరో అవ్యక్తాత్’ అన్నారు. అంటే, ‘నారాయణుడు ఈ భౌతిక జగత్తుకు అతీతుడు’. అయినప్పటికీ, భగవంతుడు మాత్రం వివిధ రూపాల్లో ఈ లోకంలో అవతరించి తన దివ్య లీలా మాధుర్యంతో లోకాన్ని రంజిల్లింపజేసి, పాపపు భారాన్ని తగ్గించి, ఆనందాన్ని వికసింపజేశారు.
శ్రీల ప్రభుపాదులవారు ఒక ఉపన్యాసంలో భగవంతుడు ఈ విధమైన రూపాలను ధరించటంలోని ఆంతర్యాన్ని ఈ కింది సంఘటనతో పోల్చి చెప్పారు: ఒకసారి ఇంగ్లాండ్ ప్రధాని మిస్టర్ గ్లాడ్ స్టోన్తో ఇంటర్వ్యూ కోసమని ఒక వ్యక్తి వచ్చారు. ప్రధాని సేవకుడు ఒకరు ఆ వ్యక్తితో, ‘ఇప్పుడు ప్రధాని ఎంతో బిజీగా వున్నారు. మీరు కాసేపు వెయిట్ చేయాలి’ అన్నారు. దీంతో ఆ వ్యక్తి బయటనే ప్రధానికోసం వేచి చూస్తున్నాడు. అలా, ఒక గంట గడిచినా ప్రధాని మాత్రం ఇంకా బయటకు రాలేదు. ప్రధానమంత్రి లోన ఏం చేస్తున్నారోననే కుతూహలంతో ఆ వ్యక్తి వాకిలిని కాస్త తెరచి లోనికి తొంగి చూశాడు. అక్కడ ప్రధానమంత్రి తన మనవడిని వీపుపై ఎక్కించుకొని గుర్రం ఆట ఆడుతున్నాడు! బయటేమో ఎంతో ముఖ్యమైన వ్యక్తి గంటనుండి వేచి చూస్తున్నాడు. ఆనందమంటే అదే. ప్రధానమంత్రి తాను గుర్రం కాకపోయినా మనవడిని తన వీపుపై ఎక్కించుకొని గుర్రంలా ఆడటం వారికి ఆనందం. అంత మాత్రాన ఆ దేశ ప్రధాని ఒక గుర్రమై పోయినట్టు కాదు. అదే విధంగా, భగవంతుని మత్స్య, కూర్మ, వరాహాది అవతారాలు సైతం కేవలం ఆనందం కోసమే.
ఒకానొక కల్పాంతర ప్రళయ సమయంలో హయగ్రీవుడనే ఒక అసురుడు బ్రహ్మదేవుని వద్దనుండి వేదాలను అపహరించాడు. అప్పుడు ఆ దేవదేవుడు మత్స్యావ
తారుడై వాటిని సంరక్షించాడు. మరొకసారి సత్యవ్రతుడనే మహారాజు భక్తి ప్రపత్తులకు ప్రీతి చెందిన స్వామి మత్స్యావతారుడై దర్శనమిచ్చాడు. అప్పుడు కలిగిన ప్రళయం నుండి వారిని సంరక్షించి వేదవిజ్ఞానాన్ని బోధించాడు. ఈ సత్యవ్రతుడే తదుపరి జన్మలో వైవస్వత మనువుగా జన్మించాడు. శ్రీకృష్ణుడు తొలుత ‘భగవద్గీత’ను సూర్యభగవానునికి బోధించగా, సూర్యభగవానుని నుండి వైవస్వత మనువు ఈ జ్ఞానాన్ని పొందాడని ‘భగవద్గీత’లోనే వుంది. ఈ ‘మత్స జయంతి’ నాడు భక్తులు రోజంతా హరినామ సంకీర్తనల్లో పాల్గొని, భగవద్గీత, శ్రీమద్భాగవతాది గ్రంథాల పఠనంతోపాటు దానధర్మాలు చేయటం ఎంతో మంచిది. శ్రీ మత్స్యావతార మూర్తికీ జై..!
శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి
93969 56984