వరంగల్ అర్బన్ : కరోనా బాధితులకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వం అన్నీ విధాల కృషి చేస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను మంత్రి గురువారం పరామర్శించారు. వారితో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాల్సిందిగా చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వస్తే ఆందోళన చెందొద్దన్నారు. ఎంజీఎంకి కావాల్సిన మందులు, రెమ్డెసివిర్ ఇంజక్షన్లు, ఆక్సీజన్ సిలిండర్లు అన్నీ ఉన్నాయన్నారు. హైదరాబాద్ తర్వాత అంతటి మెరుగైన చికిత్స మన ఎంజీఎంలోనే లభిస్తుందన్నారు. వైద్యులు తమ ప్రాణాలకు తెగించి మీకు చికిత్స అందిస్తున్నారని రోగులు ధైర్యంగా ఉండి మంచిగ కోలుకుని ఇంటికి వెళ్లాలన్నారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంత్, సీపీ తరుణ్ జోషిలతో కలిసి మంత్రి ఎంజీఎం సూపరింటెండెంట్, ఆర్ఎంవో, డ్యూటీ డాక్టర్లతో సమీక్ష చేశారు. కొవిడ్ చికిత్సకు కావాల్సిన మౌళిక సదుపాయాలు, సిబ్బంది పనితీరు తదితర అంశాల మీద మంత్రి అధికారులతో మాట్లాడారు. రోగులకు మెరుగైన వైద్యం, మంచి పోషకాహారం అందించాలన్నారు.