నల్లగొండ ప్రతినిధి, మార్చి25(నమస్తే తెలంగాణ) : శాసనమండలి ఎన్నికల్లో విజయఢంకా మోగించిన టీఆర్ఎస్ పార్టీ నాగార్జున సాగర్లోనూ తన జైత్రయాత్ర కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్నది. అందుకోసం టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో సమాయత్తమైంది. అభ్యర్థిని ప్రకటించకపోయినా.. అభ్యర్థి ఎవరైనా సరే గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్న ఏకైక టార్గెట్తో ప్రచారంలో దూసుసుపోతున్నారు. ఎక్కడిక్కడే ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాల వారీగా జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. దాదాపు ఏదో ఒక పథకం లబ్ధిదారుడు ఇంటికొక్కరైనా ఉండడంతో ఆ పథకాల ఫలితాలను కూడా సులభంగా వివరించగలుగుతున్నారు. వీటితోపాటు ఇంకా సాగర్లో మిగిలి ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే మరోసారి ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.
పటిష్ట యంత్రాంగం
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఏ పార్టీకి లేనంతగా పటిష్టపార్టీ యంత్రాంగం టీఆర్ఎస్కు మాత్రమే ఉండడం మరింత సానుకూల అంశంగా మారింది. గత నాలుగైదేండ్లుగా కాంగ్రెస్ పార్టీ నుంచి జానారెడ్డి ముఖ్య అనుచరులు, నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో టీఆర్ఎస్లోకి వచ్చారు. ఇక్కడ పార్టీ పదవులతోపాటు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న వారు ఉన్నారు. కాంగ్రెస్కు ద్వితీయ శ్రేణి నాయకత్వం లోపంతో ప్రతి ఓటర్ను జానారెడ్డి లేదా అయన కుమారులే కలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక బీజేపీకి మెజార్టీ గ్రామాల్లో క్యాడరే లేదు. దీంతో ఆ పార్టీ ప్రచారం అన్ని గ్రామాల్లోకి వెళ్లడం కూడా కష్టమనే చర్చ వినిపిస్తుంది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పల్లెపల్లెనా, తండాల్లోనూ టీఆర్ఎస్ శాఖలు ఉన్నాయి. అన్నిచోట్లా కీలకమైన నేతలు, పార్టీ యంత్రాంగం ఉన్నది. అంతేకాకుండా మెజార్టీ స్థానిక సంస్థలు కూడా టీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. నియోజకవర్గ పరిధిలో గుర్రంపోడు, పెద్దవూర, తిరుమలగిరి సాగర్, హాలియా, నిడుమనూర్, త్రిపురారం మండలాలు పూర్తిగా మాడ్గులపల్లి మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి.
మెజార్టీ స్థానాలు టీఆర్ఎస్వే
గత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ మెజారిటీ ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలతోపాటు ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను టీఆర్ఎస్ గెలుచుకున్నది. గుర్రంపోడు మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ టీఆర్ఎస్ పార్టీ వారే. మొత్తం 12 మంది ఎంపీటీసీలకు 8టీఆర్ఎస్, 4కాంగ్రెస్ కాగా, 37మంది సర్పంచుల్లో 28మంది టీఆర్ఎస్, 8కాంగ్రెస్, ఒకటి బీజేపీ గెలుచుకున్నాయి. పెద్దవూర మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీ టీఆర్ఎస్ వారే కాగా, 26మంది సర్పంచుల్లో 23టీఆర్ఎస్, ముగ్గురు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఉన్నారు. ఇక 11ఎంపీటీసీ స్థానాలకు 6టీఆర్ఎస్, ఐదు కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు. మాడ్గులపల్లి మండలంలోని 10గ్రామాలు ఈ నియోజకవర్గంలోకి వస్తుండగా, వాటిలో మూడు ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఒకటి టీఆర్ఎస్, రెండు కాంగ్రెస్ పార్టీ, సర్పంచ్ల విషయానికి వస్తే ఆరు టీఆర్ఎస్, నాలుగు కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు. త్రిపురారం మండలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కనబరిచింది. ఇక్కడ ఎంపీపీ, జడ్పీటీసీ కాంగ్రెస్ వారే. 32మంది సర్పంచులకు 23 టీఆర్ఎస్, 9మంది కాంగ్రెస్ వారు ఉన్నారు.
12మంది ఎంపీటీసీలకు 8కాంగ్రెస్, 4టీఆర్ఎస్ గెలుచుకుంది. నిడమనూర్ మండలంలో జడ్పీటీసీ కాంగ్రెస్ కాగా ఎంపీపీ టీఆర్ఎస్ పార్టీ వారే. 14మంది ఎంపీటీసీలకు 9టీఆర్ఎస్, 5కాంగ్రెస్ పార్టీ వారు ఉన్నారు. 29సర్పంచులకు 23టీఆర్ఎస్, 6కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. అనుముల మండలంలో ఎంపీపీ, జడ్పీటీసీలు కాంగ్రెస్ పార్టీ వారే కాగా, 21సర్పంచులకు 19టీఆర్ఎస్, 2కాంగ్రెస్ పార్టీవి. ఇక 7ఎంపీటీసీల్లో 4టీఆర్ఎస్, 3కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నాయి. తిరుమలగిరిసాగర్ మండలంలో 34మంది సర్పంచులకు 30మంది టీఆర్ఎస్, 4కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. 11ఎంపీటీసీ స్థానాలకు 9టీఆర్ఎస్, 2కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక హాలియా, నందికొండ మున్సిపాలిటీలను టీఆర్ఎస్ పార్టీనే ఏకపక్షంగా గెలుచుకుంది.
కదనరంగంలోకి..
2018 డిసెంబర్లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో త్రిపురారం మండలంలో మాత్రమే 235ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అధికంగా రాగా, మిగతా అన్ని మండలాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్యకే మెజార్టీ వచ్చింది. ఇక్కడ ప్రతి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధుల ప్రాతినిథ్యం కలిగి ఉండి పటిష్టమైన పార్టీ యంత్రాంగంతో టీఆర్ఎస్ ఈ ఎన్నికల్లోనూ బరిలోకి దిగుతున్నది. అభ్యర్థి ఎవరైనా గెలుపు లక్ష్యంగా పనిచేసేందుకు పార్టీ శ్రేణులన్నీ సిద్ధమై కదనరంగంలోకి దిగాయి. మండలాల వారీగా ఎమ్మెల్యేలు ఇన్చార్జీలుగా, గ్రామాల వారీగా కీలక నేతలు బాధ్యులుగా ప్రచారంలో నిమగ్నమయ్యారు. అభ్యర్థితో సంబంధం లేకుండానే ప్రభుత్వ పథకాలతో ప్రజల్లోకి దూసుకెళ్తుతున్నారు. సాగర్లో మరోసారి టీఆర్ఎస్ విజయం ఖాయమన్న చర్చ బలంగా వినిపిస్తుంది.