భువనేశ్వర్ : కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లను సేకరించి రాష్ట్రాలకు పంపిణీ చేయాలని ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన బుధవారం లేఖ రాశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి యుద్ధప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తోనే కరోనా కట్టడి సాధ్యమవుతుందని అన్నారు.
వ్యాక్సిన్ల సేకరణ కోసం పోటీ పడుతూ రాష్ట్రాల మధ్య పోరుకు ఇది వేదిక కారాదని చెప్పారు. వ్యాక్సిన్ల కార్యక్రమాన్ని వికేంద్రీకరించి విస్తారంగా వ్యాక్సినేషన్ చేపట్టేందుకు రాష్ట్రాలను అనుమతించాలని నవీన్ పట్నాయక్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఒడిషా సీఎం రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.