భువనేశ్వర్: ఒడిశాలో యాస్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్నది. బుధవారం మధ్యాహ్నం తుఫాన్ తీరాన్ని తాకినప్పటి నుంచి అక్కడ కుండపోత వర్షం కురుస్తున్నది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దాంతో ఇండ్లు నీట మునిగి కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు. రెస్క్యూ బృందాలు బాధితులు అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. పలుచోట్ల సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలిక్యాప్టర్లో తిరుగుతూ రాష్ట్రంలో వరద పరిస్థితిని పరీక్షించారు. అనంతరం తుఫాన్ వల్ల అధిక ప్రాణ నష్టం జరుగకుండా చూసుకోవాలని అధికారులను అదేశించారు. సహాయక శిబిరాల్లో బాధితులకు భోజనంతోపాటు వైద్య సదుపాయాలను కూడా సమకూర్చాలని ఆదేశాలు జారీ చేశారు.