న్యూఢిల్లీ, ఆగస్టు 11: రాష్ర్టాలకు సొంత ఓబీసీ జాబితాను తయారుచేసుకునే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. మంగళవారం లోక్సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించగా, బుధవారం రాజ్యసభ కూడా ఆమోదించింది. ఈ బిల్లుకు విపక్షాలు పూర్తి మద్దతు తెలిపాయి. 187 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి పెగాసస్ గూఢచర్యం, వివాదాస్పద సాగు చట్టాలపై విపక్షాల నిరసనతో దద్దరిల్లుతున్న రాజ్యసభలో… ఈ బిల్లుపై మాత్రం బుధవారం 5 గంటల పాటు చర్చ జరిగింది. ఈ బిల్లుతో దేశంలోని 671 కులాలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి వీరేంద్రకుమార్ తెలిపారు.
రాజ్యసభలో అదే రగడ
రాజ్యసభలో బుధవారం కూడా రగడ చోటుచేసుకున్నది. మంగళవారం పలువురు విపక్ష ఎంపీలు టేబుళ్లు ఎక్కి గందరగోళం సృష్టించిన నేపథ్యంలో బుధవారం మరింతమంది భద్రతా సిబ్బందిని మోహరించారు. అయినప్పటికీ విపక్ష ఎంపీల దూకుడుకు అడ్డుకట్ట వేయలేకపోయారు. సభలో పేపర్లు చించివేసి, మార్షల్స్ను నెట్టుకుంటూ సభాధ్యక్ష స్థానం దగ్గరికి వెళ్లేందుకు ప్రయత్నించారు. సభలో అనుచితంగా ప్రవర్తించిన ఎంపీలపై కఠిన చర్యలు తీసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని చైర్మన్ ఎం వెంకయ్యనాయుడును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కోరారు.
నిరవధిక వాయిదా
విపక్షాల నిరసనలతో రెండు రోజుల ముందుగానే పార్లమెంటు నిరవధికంగా వాయిదాపడింది. జూలై 19న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు ఈ నెల 13 వరకు కొనసాగాల్సి ఉంది.
వెంకయ్య కంటతడి
రాజ్యసభలో టేబుళ్లు ఎక్కి గందరగోళం సృష్టించిన పలువురు ప్రతిపక్ష ఎంపీల తీరుపై చైర్మన్ వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంగా భావించే పార్లమెంటును వారు అపవిత్రం చేశారని, ఆ బాధతో నిద్రలేని రాత్రిని గడిపానని గద్గదస్వరంతో అన్నారు. ఈ సమయంలో ఆయన భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. కొద్దిసేపు నోటమాట రాక తన ముందున్న డెస్క్వైపు కిందికి చూస్తుండిపోయారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు పదవీ బాధ్యతలు చేపట్టి బుధవారంతో నాలుగేండ్లు పూర్తయ్యాయి.
ఓం బిర్లా ఆవేదన
లోక్సభ కార్యకలాపాలకు ప్రతిపక్షాలు అంతరాయం కలిగించడం తనను తీవ్రంగా బాధించిందని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. మొత్తం 96 గంటలకు కేవలం 21 గంటలే సభ కొనసాగిందని తెలిపారు. ప్రతిపక్షాల గందరగోళం వల్ల సభ ప్రొడక్టివిటీ 21 శాతానికి పడిపోయిందన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లోక్సభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర పార్టీల ఫ్లోర్ లీడర్లు స్పీకర్ను ఆయన చాంబర్లో కలుసుకున్నారు.