రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ, ఆగస్టు 4: రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు తమ సొంత ఓబీసీ జాబితాను రూపొందించుకునే అధికారాన్ని తిరిగి కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ బిల్లును కేంద్రం త్వరలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను (ఎస్ఈబీసీ) గుర్తించే రాష్ర్టాల అధికారాన్ని 102వ రాజ్యాంగ సవరణ హరించిందని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. దాన్ని సమీక్షించాలంటూ కేంద్రం చేసిన అభ్యర్థననూ తోసిపుచ్చింది. ఓబీసీ జాబితాపై రాష్ర్టాల అధికారాలను కేంద్రం లాక్కొని, సమాఖ్య నిర్మాణంపై దాడి చేస్తున్నదని ప్రతిపక్షాల ఆరోపణ. ఈ నేపథ్యంలో ఓబీసీ జాబితాకు సంబంధించి రాష్ర్టాల అధికారాన్ని పరిరక్షించేందుకు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నామని కేంద్రం గత నెలలో రాజ్యసభలో తెలిపింది. ఆ మేరకు బిల్లును క్యాబినెట్ ఆమోదించిందని సమాచారం. పాఠశాల విద్యకు సంబంధించి ‘సమగ్ర శిక్షా పథకా’న్ని మరో ఐదేండ్లు కొనసాగించడానికీ క్యాబినెట్ ఆమోదించింది.