భోపాల్: ఒక ఊపిరితిత్తు మాత్రమే కలిగి ఉన్న నర్సు కరోనాపై పోరాడారు. మహమ్మారి బారినపడిన ఆమె ధైర్యం కోల్పోలేదు. యోగా, ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలతో కరోనా నుంచి కోలుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన 39 ఏండ్ల ప్రఫుల్లిట్ పీటర్ చిన్నతనంలో ప్రమాదానికి గురయ్యారు. ఆ సందర్భంలో ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు దెబ్బతిన్న ఒక ఊపిరితిత్తును తొలగించారు. నాటి నుంచి ఆమె ఒక ఊపిరితిత్తు ద్వారానే శ్వాస తీసుకుంటున్నారు. ఈ విషయం ఆమెకు కూడా తెలియదు. 2014లో చెస్ట్ ఎక్స్ రే తీసిన సందర్భంలో ఈ విషయం తెలిసింది.
కాగా, నర్సు వృత్తిలో ఉన్నప్రఫుల్లిట్ పీటర్, తికమ్గఢ్ ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోనా వార్డులో విధులు నిర్వహిస్తుండగా వైరస్ సోకింది. రెండు ఊపిరితిత్తులు ఉన్నవారే కరోనాపై పోరాడలేకపోతుండగా, ఒక ఊపిరితిత్తు మాత్రమే ఉన్న ఆమె కోలుకోవడం కష్టమని చాలా మంది అనుకున్నారు.
అయితే ప్రఫుల్లిట్ పీటర్ ధైర్యం కోల్పోలేదు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం 14 రోజులు హోమ్ ఐసొలేషన్లో ఉన్నారు. ప్రతి రోజు యోగా, ప్రాణాయామం, బూరలో గాలి ఊదడం వంటి శ్వాస వ్యాయామాలు చేశారు. 14 రోజుల అనంతరం కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటికే కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న ఆమె, మహమ్మారిపై తాను పొరాడి జీవిస్తానన్న ధీమాతో ఉన్నారు.