బన్సీలాల్పేట్, జూలై 3: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతగా.. ప్రతిఒక్కరూ విరివిగా మొక్కలను నాటాలని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం పద్మారావునగర్లోని జీహెచ్ఎంసీ పార్కులో బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కె.హేమలతతో కలిసి మొక్కలు నాటారు. ప్రతిరోజు వందలాది మంది వచ్చే పార్కు అభివృద్ధికి సహకరిస్తానని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యు లు మంత్రిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ బి.శ్రీనివాస్రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, హార్టికల్చర్ విభాగం అధికారులు, టీఆర్ఎస్ నాయకులు జి.పవన్కుమార్గౌడ్, జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడు ఇ.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్: యూసుఫ్గూడ లక్ష్మి నరసింహనగర్లో చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యం బారిన పడకుండా నగరాన్ని కాపాడటంతో పాటు ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ బృహత్ ప్రణాళికలు రూపొందించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం నగరాన్ని నందనవనంగా తీర్చిదిద్దేందుకు లక్షలాది మొక్కలు, చెట్లు నాటుతూ ప్రజలకు స్వచ్ఛమైన గాలినందించడంలో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమేశ్తో కలిసి ప్రభుత్వ పాఠశాల రోడ్డు, మసీదు రోడ్డు ప్రాంతాల్లో మొక్క లు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ ఏఈ సావిత్రి, జీహెచ్ఎంసీ సిబ్బందితో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బేగంపేట్: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి అన్నారు. హరితహారంలో భాగంగా డివిజన్లో వివిధ బస్తీల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.