న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళన రేపుతున్నది. దేశ రాజధాని ఢిల్లీ, ముంబైని దాటి కరోనా హాట్స్పాట్గా మారింది. ఇటీవల 40 మంది సుప్రీంకోర్టు సిబ్బంది వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త కోసం సుప్రీంకోర్టు బుధవారం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించే వారిలో కరోనా లక్షణాలుంటే కరోనా టెస్ట్ తప్పనిసరి అని పేర్కొంది. రిజిస్ట్రీ సిబ్బంది, కోఆర్డినేట్ ఏజెన్సీల సిబ్బంది, న్యాయవాదులు, వారి సిబ్బందిలో కోవిడ్ -19 వ్యాప్తికి నోటిఫై చేసిన లక్షణాలున్నట్లయితే రాపిడ్, ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని వెల్లడించింది.
అలాగే కరోనా లక్షణాలున్నవారు కోర్టుకు రావద్దని, ఐసొలేషన్లో ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, తరచుగా చేతులను శానిటైజ్ చేసుకోవడం వంటి కరోనా నిబంధనలను సిబ్బంది పాటించేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించింది. లిఫ్ట్లో ముగ్గురు కన్నా ఎక్కువ మంది వెళ్లకూడదని, పైకి వెళ్లేటప్పుడు మాత్రమే లిఫ్ట్ వినియోగించాలని, కిందకు మెట్ల ద్వారా రావాలని పేర్కొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు బుధవారం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.