న్యూఢిల్లీ: ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి జారీచేసే ఈ-ట్రాఫిక్ చలాన్లపై కేంద్ర రవాణాశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘన జరిగిన 15 రోజుల్లోగా చలాన్ నోటీసులు పంపించాలని, చెల్లింపు జరిగేంత వరకు ఉల్లంఘనపై ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని ఒక నోటిఫికేషన్లో తెలిపింది. ఈ మేరకు మోటర్ వెహికిల్ యాక్ట్-1989 ఫర్ ఎలక్ట్రానిక్ మానిటరింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రోడ్ సేఫ్టీ నిబంధనలకు సవరణలు చేసింది. ఈ విషయాన్ని గురువారం ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం.. జాతీయ, రాష్ట్ర రహదారులపై అధిక రద్దీ/ప్రమాదం జరిగే అవకాశమున్న ప్రాంతాల్లో, కీలక కూడళ్లలో, కనీసం 10 లక్షల పైచిలుకు జనాభా కలిగిన అన్ని పట్టణాలతో పాటు నోటిఫికేషన్లో పేర్కొన్న 132 నగరాల్లో.. ఎలక్ట్రానిక్ ట్రాఫిక్ భద్రతా నియంత్రణ సాధనాలను రాష్ట్రప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని పేర్కొంది. వాహనదారులకు, ట్రాఫిక్కు ఇబ్బంది కలుగని రీతిలో వీటిని అమర్చాలని చెప్పింది. ఈ-చలాన్ వ్యవస్థను 2019లో ఢిల్లీలో ప్రారంభించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ విధానం అందుబాటులో ఉన్నది. మహారాష్ట్రలో అత్యధికంగా 19 నగరాల్లో, యూపీలో 17, ఏపీలో 13, పంజాబ్లో 9 నగరాల్లో ఈ విధానం అమల్లో ఉన్నది.
వేటికి ఈ-చలాన్లు?
అధిక వేగం, నో పార్కింగ్ చోట వాహనాన్ని నిలపడం, హెల్మెట్లేని ప్రయాణం, రెడ్లైట్ క్రాసింగ్, జీబ్రా క్రాసింగ్, డ్రైవింగ్ చేసేప్పుడు ఫోన్ మాట్లాడటం, ఇష్టారీతిన వాహనాలను ఓవర్టేక్ చేయడం.. ఇతరత్రా ఉల్లంఘనల్లో ఎలక్ట్రానిక్ ట్రాఫిక్ భద్రతా నియంత్రణ సాధనాల సాయంతో ఈ-చలాన్లను జారీ చేస్తారు.
చలాన్పై ఏమేమి ఉండాలి?
ఈ-చలాన్లపై ఉల్లంఘన జరిగిన ప్రాంతం, తేదీ, సమయంతో పాటు ఎలాంటి ఉల్లంఘన జరిగిందన్న విషయాన్ని ప్రస్తావించాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలను రికార్డు చేసే ఈ-వ్యవస్థలివే!
స్పీడ్ కెమెరా, సీసీటీవీ కెమెరా, స్పీడ్ గన్, శరీరంపై ధరించే కెమెరా, డ్యాష్బోర్డ్ కెమెరా, అటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ఏఎన్పీఆర్), వెయ్-ఇన్ మెషిన్ (డబ్ల్యూఐఎం)