న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి తన తండ్రి రామ్విలాస్ పాశ్వాన్ స్థాపించిన లోక్జనశక్తి పార్టీ (ఎల్జేపీ)లో చీలికతో ఉక్కిరిబిక్కరవుతున్న చిరాగ్ పాశ్వాన్.. తాజాగా ప్రధాని నరేంద్రమోదీపై తన విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. హనుమంతుడిని చంపుతుంటే రాముడు మౌనంగా ఉండటం సరికాదని వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీకి తాను నమ్మినబంటును అని, మోదీ రాముడైతే తాను హనుమంతుడినని చిరాగ్ చెప్పుకున్నారు.
అయితే, ఇటీవల చిరాగ్ పినతండ్రి పరాస్ తిరుగుబాటుతో ఎల్జేపీలో చీలిక వచ్చింది. లోక్సభలో ఎల్జేపీ పక్షనేత హోదా నుంచి కూడా చిరాగ్ను తొలగించారు. అంతేగాక పార్టీ అధ్యక్ష పదవి నుంచి చిరాగ్ తొలగిస్తున్నట్లు పరాస్ ప్రకటించారు. ఇంత జరుగుతున్నా ప్రధాని మోదీ మౌనంగా ఉండటంపై చిరాగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
‘సత్యయుగం నుంచి నేటి వరకు రామాయణంలో మనం చూస్తున్నాం. రాముడి ప్రతి నిర్ణయానికి హనుమంతుడు బాసటగా నిలుస్తూ వచ్చాడు. రాముడి అడుగులో అడుగు వేసి నడిచాడు. ఎల్జేపీ చేసింది కూడా అదే. నరేంద్ర మోదీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిచ్చింది. మోదీకి హనుమంతుడిలా నేను ప్రతిసారి మద్దతుగా నిలిచినా.. నేను కష్టంలో ఉన్నప్పుడు మోదీ స్పందించకపోవడం బాధిస్తున్నది’ అని చిరాగ్ వ్యాఖ్యానించారు.