లోక్సభకు వెల్లడించిన నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ, జూలై 26: కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు కరెన్సీ నోట్లను ముద్రించాలన్న ఆలోచన ఏమీలేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటుకు తెలిపారు. లోక్సభలో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు ఆమె పై విధంగా బదులిచ్చారు. ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకునేందుకు, ఉద్యోగాలను కాపాడేందుకు నోట్ల ముద్రణను చేపట్టాలని పలువురు ఆర్థికవేత్తలు సూచించినట్టు ఈ సందర్భంగా నిర్మల తెలిపారు. ‘ప్రభుత్వ వ్యయాలకు అవసరమైన నిధులను సమీకరించడానికి ప్రైమరీ మార్కెట్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నేరుగా గవర్నమెంట్ సెక్యూరిటీస్ను కొనుగోలు చేస్తుంది. కరెన్సీ లోటు తలెత్తినప్పుడే ఇది జరుగుతుంది. అలాంటి సమయంలోనే నోట్ల ముద్రణను చేపట్టాలి. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. లాక్డౌన్ ఆంక్షల ఎత్తివేత వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా బలంగానే ఉన్నది’ అని ఆమె అన్నారు.