హుజూరాబాద్లో బీజేపీ, కాంగ్రెస్కు నూకలు చెల్లాయి..
టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్
హుజూరాబాద్టౌన్, జూన్ 5 : హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను విభజించి పాలించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కార్యకర్తలు, టీఆర్ఎస్ అభిమానులు ఆయనను చిత్తుగా ఓడిస్తారని టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ స్పష్టం చేశారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల క్రితమే సీఎం కేసీఆర్కు తనకు మధ్య గ్యాప్ వచ్చిందని చెప్పిన మాజీ మంత్రి ఈటల, అప్పుడే పార్టీ వీడి వెళ్లకుండా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. తన అవసరాల కోసం పార్టీలో ఉండి మంత్రి పదవితో అక్రమంగా ఆస్తులు సంపాదించుకోవడానికేనా? అని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలు ఛీత్కరించుకునేలా వ్యవహరించారని మండిపడ్డారు. 2004లో టీఆర్ఎస్లో చేరిన ఈటల పార్టీ అధినేతను కలువడానికి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లి కలిసిన సందర్భాలు అనేకం ఉన్నాయని, అలాంటిది సీఎంను కూడా ఎవరైనా అపాయింట్మెంట్ తీసుకొని కలువడం ఆనవాయితీగా వస్తుందని, తనను సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో కలవనీయలేదనడం సరికాదన్నారు. టీఆర్ఎస్లో కార్యకర్తలు, నాయకులు కలిసిమెలిసి ఉండడం ఈటలకు ఇష్టం లేదని, కుట్రలు పన్ని విడదీసేవాడని గుర్తు చేశారు. ఈటల రాజేందర్లాంటి నాయకులను, కార్యకర్తలను వందలు, వేలాది మందిని సీఎం కేసీఆర్ నియోజకవర్గంలో తయారు చేశారని, ఆయన పార్టీ వీడితే నష్టమేమీ లేదన్నారు. ఈటల రాజేందర్ నియోజకవర్గంకు రాకముందే ఇక్కడ 2001లోనే పార్టీ అధినేత కేసీఆర్ పిలుపుతో అన్ని మండలాల్లో జడ్పీటీసీలను, ఎంపీపీలను, ఎంపీటీసీలను, సర్పంచ్ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకున్నదని గుర్తు చేశారు.
హుజూరాబాద్లో శాసనసభకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా, అధినేత కేసీఆర్ ఎవరికి టికెట్ ఇచ్చి నిలబెట్టినా ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేసి టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రం, హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి, కాంగ్రెస్కు నూకలు చెల్లాయన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొండ్ర నరేశ్ వంటి వారు టీఆర్ఎస్లో చేరుతామంటే ‘మీలాంటి వారు బయట ఉంటేనే బాగుంటుంది, నీకు ఏ పని కావాలన్నా నేను చేస్తా కదా’ అంటూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ దరిదాపులకు రాకుండా చేసి కన్నతల్లి వంటి పార్టీకి ద్రోహం చేశాడని గుర్తు చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక, వైస్ చైర్పర్సన్ కొలిపాక నిర్మల, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు దొంత రమేశ్, పట్టణాధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు, కౌన్సిలర్ కల్లెపల్లి రమాదేవి, సింగిల్విండో అధ్యక్షుడు ఎడవెల్లి కొండల్రెడ్డి, కౌన్సిలర్లు తాళ్లపెల్లి శ్రీనివాస్గౌడ్, ముక్క రమేశ్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి ఆలేటి శ్రీరాం, సీనియర్ నాయకులు గందె శ్రీనివాస్, మొలుగు పూర్ణచందర్, ఎండీ రియాజ్, గందె సాయిచరణ్, సామల రాజారెడ్డి, సందమల్ల బాబు, దుబాసి బాబు, మధూకర్రెడ్డి, ప్రతాపకృష్ణ, విక్రంరెడ్డి, మనోహర్ పాల్గొన్నారు.