సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ కార్మికుల ఆరోగ్య రక్షణకు సర్కార్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నది. భాగ్యనగరాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల ఆర్యోగ పరిరక్షణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే తాజాగా పారిశుధ్య కార్మికుల ఆరోగ్య రక్షణకు దాదాపు కోటి రూపాయల విలువైన హెల్త్కిట్లను శుక్రవారం నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డిలు పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రూ. 4,133 విలువైన ఒక్కో కిట్ను 2,374 మందికి తొలి దశ కింద పంపిణీ చేశారు. ఒక్కో కిట్లో 56 మాసుస్క్లు, రేడియం సేఫ్టీ జాకెట్, రెయిన్ కోట్, రెండు జతల గ్లౌజ్లు, ఒక సేఫ్టీ షూ, 40 సబ్బులు, ఒక టవల్, క్యాప్, మూడు శానిటైజర్ బాటిళ్లు, రెండు లీటర్ల కొబ్బరి నూనె, ఒక కిట్ బ్యాగ్ ఉన్నాయి.
వర్షాకాలం ప్రవేశిస్తున్న దృష్ట్యా స్వీయ ఆరోగ్య పరిరక్షణకై ప్రతి కార్మికుడు విధిగా సేఫ్టీ కిట్లను ధరించి విధులకు హాజరు కావాలని మేయర్ గద్వాల విజయలక్ష్మీ అన్నారు. కార్మికుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. ఈ ఖరీదైన ఈ కిట్లను తప్పనిసరిగా వాడాలని సూచించారు. కరోనా నుంచి కాపాడేందుకుగానూ ఇప్పటికే కార్మికులందరికీ వ్యాక్సిన్ ఇప్పించామని మేయర్ అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ సంతోశ్, తదితరులు పాల్గొన్నారు.