న్యూఢిల్లీ, మే 10: కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ అవయవ మార్పిడి జరిగిన వ్యక్తులకు మహమ్మారి ముప్పు ఉంటుందని తాజా పరిశోధన హెచ్చరించింది. ‘రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అవయవ మార్పిడి జరిగిన వ్యక్తులకు కొంత రక్షణ లభిస్తుంది. కానీ వీరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలను మానకూడద’ని ఆ పరిశోధన తెలిపింది. వీరు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఆరోగ్యవంతమైన రోగ నిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తుల్లో కంటే తక్కువగానే యాంటీబాడీలు అభివృద్ధి చెందాయని పేర్కొంది. అవయవ మార్పిడి జరిగిన 658 మందిపై అమెరికాలోని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఆధ్వర్యంలో ఈ పరిశోధన నిర్వహించారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా 658 మందికి గాను 301 మందిలో (46 శాతం) యాంటీబాడీలను గుర్తించలేకపోయినట్టు పరిశోధకులు తెలిపారు.