న్యూఢిల్లీ: రియాల్టీ సంస్థ సూపర్టెక్ లిమిటెడ్కు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. నోయిడాలో తాము నిర్మించిన రెండు 40 అంతస్తుల టవర్లను కూల్చేయాల్సిందిగా గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ సూపర్టెక్ వేసిన పిటిషన్ను సోమవారం అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. రెండు టవర్లను కూల్చడం కంటే ఒక టవర్లోని 224 ఫ్లాట్లను, వాటి కమ్యూనిటీ ఏరియాను కూల్చేస్తామని తన పిటిషన్లో సూపర్టెక్ తెలిపింది. అయితే జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన సుప్రీం ధర్మాసనం అంగీకరించలేదు. ఇతర అప్లికేషన్లు లేదా స్పష్టత కోసం వేసిన అప్లికేషన్ల రూపంలో ఉన్న ఈ పిటిషన్ తీర్పుపై సమీక్ష కోరకూడదంటూ దీనిని కొట్టేసింది.
తమ టవర్-17 ఇతర నివాస ప్రాంతాల పక్కనే ఉన్న కారణంగా దానిని పేలుడు పదార్థాల సాయంతో పేల్చడం కుదరదని, ఒక్కో ఇటుక లెక్కన కూల్చాలంటే చాలా ఖర్చవుతుందని తన పిటిషన్లో సూపర్టెక్ తెలిపింది. ఇప్పటికే ఈ టవర్ల నిర్మాణానికి భారీగా ఖర్చయిందని, అందుకే మరింత ఖర్చును అడ్డుకోవడం కోసమే తాము తీర్పుపై సమీక్ష కోరినట్లు తెలిపింది. ఈ రెండు టవర్లు నోయిడా భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. వాటిని కూల్చేయాల్సిందే అంటూ ఆగస్ట్ 31న తీర్పు వెలువరించింది.