న్యూఢిల్లీ, మే 27: ‘ఒకే వ్యక్తి రెండు వేర్వేరు టీకాల డోసులు వేసుకొంటే ఆ వ్యక్తిపై గణనీయమైన ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పడానికి లేదు. నిజానికి రెండు వేర్వేరు టీకాల డోసులను వేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మరింత పెరుగుతుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. అయితే దీనిపై కచ్చితమైన అభిప్రాయానికి రావాలంటే మాత్రం మరింత పరిశోధన అవసరం’ అని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఓ గ్రామంలో 20 మందికి మొదట కొవిషీల్డ్ వేసి తర్వాత రెండో డోసు కొవాగ్జిన్ వేయటం కలకలం రేపింది. దీనిపై గురువారం విలేకరులు అడిగిన ప్రశ్నకు పాల్ స్పందిస్తూ.. ‘ఆ ఘటన నిజంగానే జరిగినా కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే మొదటి, రెండో డోసు ఒకే టీకా ఇవ్వాలని ఆరోగ్యసిబ్బందికి విజ్ఞప్తి చేస్తున్నా’ అన్నారు.