నల్లగొండ రూరల్/ కట్టంగూర్/ తిప్పర్తి/ నార్కట్పల్లి, జూన్ 30 : నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 4వ విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మండల, గ్రామస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి సమన్వయం చేసుకుని విజయవంతం చేయాలని నల్లగొండ ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి కోరారు. బుధవారం నల్లగొండ ఎంపీడీఓ కార్యాలయంలో పల్లె ప్రగతిపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, రోజువారీ కార్యాచరణ రూపొందించి గ్రామసభలు నిర్వహించాలన్నారు. ప్రధానంగా పారిశుధ్యంపై చర్యలు తీసుకుని, మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేయాలన్నారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. విద్యుత్ లూజ్ లైన్లను సరిచేసి, లేనిచోట విద్యుత్ దీపాలు పెట్టాలని పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీపీ సుమన్, ఎంపీడీఓ వై.శ్రీనివాస్రెడ్డి, ఎంపీఓ జూలకంటి మాధవరెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు పాల్గొన్నారు. అదేవిధంగా కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి బాలశౌరి ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య అధ్యక్షతన అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జడ్పీటీసీ తరాల బలరాములు, ఎంపీడీఓ పోరెళ్ల సునీత, వైస్ ఎంపీపీ కోటిరెడ్డి, ఎంపీఓ పర్వేజ్, ఏపీఓ వెంకటేశం పాల్గొన్నారు. తిప్పర్తిలో మండల ప్రత్యేకాధికారి గంగయ్య పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడారు. ఎంపీడీఓ మహేందర్రెడ్డి, ఈఓఆర్డీ సంగీత పాల్గొన్నారు. నార్కట్పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ పారదర్శకంగా పనులు పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీఓ సత్యనారాయణ, ఏపీఓ యాదయ్య, రాంబాబు పాల్గొన్నారు.