బల్ల లక్ష్మి తోటలో విరగ్గాసిన చెట్టు
ప్రయోగాత్మకంగా ఒక మొక్క పెంపకం
ఏడాదికి రెండు క్వింటాళ్ల దిగుబడి
మార్కెట్లో మంచి డిమాండ్
కిలోకు 130 నుంచి 150 పైనే..
ధర్మారం, ఏప్రిల్ 17: వాటర్ ఆపిల్ శాస్త్రీయ నామం సిజియం సమరాంజెన్స్. దీనిని రోజ్ ఆపిల్, గులాబ్ జామూన్ కాయ అని కూడా పిలుస్తారు. తెలుగులో కమ్మరి కాయలు అని కూడా అంటారు. ఇది ఎక్కువగా ఆగ్నేయపు ఆసియా దేశాల్లో, ఇండోనేషియా, మలేసియా దేశాల్లో పెరిగే ఒక ఉష్ణమండల పండు. కేరళ రాష్ట్రంలోనూ సాగవుతున్నది. కొద్దిరోజులుగా మన వద్దా కనిపిస్తున్నది.
ఇదీ స్పెషల్ వాటర్ ఆపిల్ మార్చిలో
పూతకు వచ్చి, మే దాకా కాపు కాస్తుంది. కొన్ని కొమ్మలకు పూత ఉంటే మరి కొన్ని కొమ్మలకు ఫలాలు వస్తుంటాయి. సాధారణంగా ఈ చెట్టు మూడు నుంచి పది మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. దీని ఆకులు లేత ఆకుపచ్చ రంగులో, పూలు తెల్లగా గుత్తులు, గుత్తులుగా పూస్తాయి. కాయలు సైతం కొమ్మలు విరిగి పడేంత గుంపులుగా కాస్తుంది. మూడు నెలలపాటు పూత వెనుక పూతతో కాయలు కాస్తూనే ఉంటుంది. లేలేత ఆకు పచ్చ రంగులో గంట ఆకారాన్ని పోలి ఉంటాయి. వగరు, కొంత తీపిగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువ. ఈ కాయ దూదిలా ఉండి నోట్లో వేసుకున్న వెంటనే ద్రవ రూపంలోకి మారుతుంది.
కటికెనపల్లిలో ఫలించిన ప్రయోగం..
ధర్మారం మండలం కటికెనపల్లికి చెందిన రైతు దంపతులు బల్ల లక్ష్మి, నర్సింగానికి గ్రామంలో మూడెకరాల మామిడి తోట ఉంది. పదిహేనేండ్లుగా మామిడి మొక్కలు పెంచుతూ వృద్ధి చేయడమే కాదు తోటను గుత్తకు ఇస్తుంటారు. అయితే ఒకరోజు మామిడి మొక్కలు సరఫరా చేసే ఓ వ్యక్తి వాటర్ ఆపిల్ గురించి వీరికి చెప్పారు. పెంచితే బాగా లాభాలు ఉంటాయని సూచించడంతో దంపతులు ఆసక్తి చూపారు. అతని వద్ద మొక్కను తీసుకొని తోటలో నాటారు. అయితే పెరిగినట్లే పెరిగి కొన్ని రోజులకే ఎండిపోవడంతో మరో మొక్కను తీసుకొని మళ్లీ నాటారు. ప్రత్యేక శ్రద్ధతో కంటికి రెప్పలా కాపాడడంతో దక్కింది. రెండేండ్లలోనే ఏపుగా పెరిగింది. ప్రస్తుతం కాపునకు రావడంతో లక్ష్మి దంపతులు ఐదు రోజులకు ఒకసారి కాయలను తెంపి పెద్దపల్లి, ధర్మారం మార్కెట్లో విక్రయిస్తున్నారు. కిలోకు 130 నుంచి 150 వరకు అమ్ముతున్నారు. ఒక సీజన్లో 2 క్వింటాళ్లకు పైబడి దిగుబడి అంటే తక్కువలో తక్కువ 26వేల ఆదాయం వస్తుందని దంపతులు చెబుతున్నారు.
పోషకాలు బోలెడు..
విటమిన్లు, మినరల్స్, కాల్షియం, ఐరన్తోపాటు అనేక ఔషధగుణాల సమ్మేళనమే ఈ వాటర్ ఆపిల్. ఇది పేరుకు తగ్గట్టుగానే దాహం తీరుస్తుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. కంటి సమస్యలను తగ్గిస్తుంది. తెల్ల రక్తకణాల వృద్ధికి తోడ్పడుతుంది. విటమిన్ బీ, సీ ఇందులో పుష్కలంగా ఉంటాయి. మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఈ పండు మంచి ఫుడ్గా చెప్పవచ్చు. టైప్-1, టైప్-2 డయాబెటిస్తో బాధపడుతున్న వారికి ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. యాంటి డయాబెటిక్ గుణాలు ఎక్కువగా ఉన్నాయని సైంటిస్టులు తమ పరిశీలనలో చెప్పారు.
మంచి లాభమైతంది..
వాటర్ ఆపిల్తో మంచి లాభమైతంది. మేం ఒకే మొక్కను తెచ్చి పెంచినం. రెండేండ్లుగా మస్తు కాయలు కాస్తున్నది. ఈ పండ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటున్నది. పెద్దపల్లి, ధర్మారం, జగిత్యాల మార్కెట్ల అమ్ముతం. మున్ముందు మరిన్ని చెట్లను పెంచుతం.
బల్ల లక్ష్మి, కటికెనపల్లి