న్యూఢిల్లీ: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయంగా మేం ఒకటి కాకపోయినా.. మా మధ్య బంధం బ్రేకవ్వలేదన్నారు. నేనేమీ నవాజ్ షరీఫ్ను కలిసేందుకు వెళ్లలేదని, ఒకవేళ తాను ప్రధానిని వ్యక్తిగతంగా కలిసినా, దాంట్లో తప్పేమీ లేదని సీఎం ఉద్దవ్ అన్నారు. గతంలో ప్రధాని మోదీ ఓ సారి అకస్మాత్తుగా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ను కలిశారు. ఆ సంఘటనను గుర్తుచేస్తూ ఉద్దవ్ చురక వేశారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల వేళ శివసేన, బీజేపీలు కూటమిగా పోటి చేసినా.. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఆ రెండు పార్టీలు విడిపోయిన విషయం తెలిసిందే. ఇవాళ జరిగిన భేటీలో మరాఠా రిజర్వేషన్లు, మెట్రో కారు షెడ్, జీఎస్టీ పన్ను వసూళ్ల పరిహరం గురించి ప్రధానితో చర్చించినట్లు సీఎం ఉద్దవ్ తెలిపారు. మరాఠా రిజర్వేషన్పై ఉన్న 50 శాతం సీలింగ్ను ఎత్తివేయాలని ప్రధానిని కోరారు.
మరాఠా భాషకు ప్రాచీన హోదా ఇవ్వాలన్న డిమాండ్ కేంద్రం వద్ద పెండింగ్లో ఉందని సీఎం చెప్పారు. ఈ అంశాన్ని పరిశీలిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. మహారాష్ట్రలో 18 నుంచి 44 ఏళ్ల గ్రూపులో ఆరు కోట్ల మంది ఉన్నారని, వారికి రెండు సార్లు కోవిడ్ టీకాలు ఇవ్వాలంటే 12 కోట్ల డోసులు అవసరం అవుతుందని ఉద్దవ్ తెలిపారు. అందరికీ ఇవ్వాలని ప్రయత్నించాం, కానీ సరిపడా సరఫరా లేక ఆగిపోయినట్లు ఆయన చెప్పారు. వ్యాక్సిన్ ప్రొక్యూర్మెంట్ను కేంద్రీకృతం చేసిన ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెబుతున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే ఇండియాలో ప్రతి ఒక్కరూ వ్యాక్సినేట్ అవుతారని సీఎం ఉద్దవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీని కలిసిన వారిలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్, అశోక్ చౌహాన్ ఉన్నారు.