మహబూబ్ నగర్ : పట్టణ ప్రగతి ద్వారా మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో స్పష్టమైన మార్పు రావాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎన్. సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన జిల్లాలోని జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో విస్తృత పర్యటన చేసి పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టిన పరిశుభ్రత, హరిత హారం తదితర కార్యక్రమాలను తనిఖీ చేశారు. ముందుగా ఆయన జడ్చర్ల మున్సిపాలిటీ ని సందర్శించి అక్కడ పట్టణ ప్రగతి ని పరిశీలించిన అనంతరం భూత్పూర్ మున్సిపాలిటీని సందర్శించారు.
భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో జాతీయ రహదారి చౌరస్తాలో రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను, కూడలి అభివృద్ధిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. భూత్పూర్ – మహబూబ్ నగర్ రహదారి మధ్యలో నాటిన మొక్కలలో ఎక్కడైనా మొక్కల మధ్య ఎడం ఉన్నట్లయితే తక్షణమే పెద్ద మొక్కలు నాటించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రహదారికి ఇరువైపులా మూడు వరుసల్లో పెద్ద మొక్కలు నాటాలని చెప్పారు. హరిత హారంలో మొక్కలు నాటారు.
అనంతరం బైపాస్ రహదారిలో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. అంతేకాక పాలకొండ వద్ద ఉన్న ప్రభుత్వ నర్సరీని సందర్శించి బోర్డ్ ఏర్పాటు చేయాలని, అలాగే అన్ని నర్సరీలలో బోర్డులు ఏర్పాటు చేయాలని డీఎఫ్వోకు సూచించారు. అనంతరం ఆయన బాలాజీ నగర్ లోని పట్టణ ప్రకృతి వనం తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
పట్టణ ప్రకృతి వనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రకృతి వనాలలో భవిష్యత్తులో ఆదాయం ఆర్జించే విధంగా సంపద వనాలను అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా టేకు, శ్రీ గంధం చెట్లు పెంచినట్లయితే భవిష్యత్తులో మున్సిపాలిటీకి మంచి ఆదాయం సమకూరే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
ఆ తర్వాత పాలమూరు విశ్వవిద్యాలయం సమీపంలో బండమీదపల్లె మహిళా సంఘ సభ్యులు, అంగన్వాడీ కార్యకర్తల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తూర్పు కమాన్ వద్ద ఉన్న రైతు బజార్ ను తనిఖీ చేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ కె .సి. నర్సింహులు, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్, డీఎఫ్వో గంగి రెడ్డి, మహబూబ్ నగర్ మున్సిపల్ కమిషనర్లు ప్రదీప్ కుమార్, నూరుల్ నజీబ్, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణ, ట్రాన్స్కో ఎస్ఈ శ్రీరామమూర్తి ఉన్నారు.