ఆదిలాబాద్, మే 29 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశమున్న వారిని సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన వారికి ప్రభుత్వం వ్యాక్సిన్ అందిస్తున్నది. ఈ నెల 28 నుంచి రెండ్రోజుల పాటు సూపర్ స్ర్పైడర్లు కూరగాయలు, పండ్ల వ్యాపారులు, రేషన్ డీలర్లు, వర్కర్ల, గ్యాస్ డెలివరీ బాయ్స్, పెట్రోల్ బంకుల్లో పనిచేసే వారు, జర్నలిస్టులు, విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో పనిచేసే వారికి వైద్యశాఖ అధికారులు వ్యాక్సిన్ వేశారు. ఆర్టీసీలో పనిచేసే డ్రైవర్లు, కండక్టర్లను సైతం సూపర్ స్ప్రెడర్లుగా గుర్తించిన ప్రభుత్వం వారికి సైతం టీకా పంపిణీ చేయనుంది. ఇందుకు వైద్యాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
రీజియన్ పరిధిలో 2620 మందికి టీకా
ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ డిపోలున్నాయి. వీటిలో 45 ఏళ్ల వయస్సు దాటిన వారు 1800 మంది ఇప్పటికే టీకా తీసుకున్నారు. మిగతా 2620 మంది ఆర్టీసీ సిబ్బంది టీకాకు అర్హులుగా గుర్తించారు. వారి వివరాలను వైద్యశాఖ అధికారులకు పంపించారు. అద్దె బస్సుల డ్రైవర్లకు సైతం టీకా వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆదిలాబాద్ డిపోలో 261 మందికి, ఉట్నూర్ డిపోలో 69 మందికి, నిర్మల్ డిపోలో 304 మందికి, భైంసా డిపోలో 220 మందికి, మంచిర్యాల డిపోలో 274 మందికి, ఆసిఫాబాద్ డిపోలో 116 మందికి, ఆర్ఎం కార్యాలయంలో ఐదుగురు ఉన్నట్లు గుర్తించారు. వారికి నేడు వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు.