జిల్లాలో 33 వేల ఎకరాల్లో సాగు
ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి
రైతుల హర్షం
తాంసి, ఏప్రిల్ 8 : జిల్లాలో జొన్న పంట ఆశాజనకంగా ఉంది. ఇప్పుడిప్పుడే కోతలు మొదలు కావడంతో రైతులు నూర్పిడి చేసే పనుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 33134 ఎకరాల్లో సాగు
జిల్లాలో 33134 ఎకరాల్లో రైతులు జొన్నపంటను సాగు చేశారు. తక్కువ శ్రమ, పెట్టుబడి, స్వల్పకాలంలో పంట చేతికి వచ్చే అవకాశం ఉండడంతో రైతులు జొన్నసాగు చేశారు. మూడు నుంచి మూడున్నర నెలల్లోనే పంట కూడా చేతికి వచ్చింది. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుండడంతో తాము పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మార్కెట్లో మంచి డిమాండ్…
జొన్నలకు మార్కెట్లో మంచి డి మాండ్ ఉంది. గతేడాది జొన్నలను రాష్ట్ర ప్రభుత్వమే క్వింటాలుకు రూ.2600 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసింది. ఈ యేడు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.ప్రభుత్వం కొంటేనే రైతుకు లాభం
నేను పత్తి పంటను తీసేసి మూడు ఎకరాల్లో జొన్నపంటను వేసిన. ఎకరాకు దాదాపు 13 క్వింటాళ్ల చొప్పున మొత్తం 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అయితే గతేడాది ప్రభుత్వమే జొన్నలు కొనుగోలు చేసింది. ఇప్పుడు కూడా ప్రభుత్వం కొంటేనే మేలు జరుగుతుంది. ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు కొంటే మాకు ఏం మిగలదు.
-వెంకటరమణ, రైతు పొన్నారి