ముంబై : ముంబై వాసులకు స్థానిక మున్సిపాల్టీ తీపి కబురు చెప్పింది. కోవిడ్ ఉదృతి తగ్గే వరకు నగర ప్రజలకు ప్రాపర్టీ ట్యాక్సును పెంచడం లేదని మేయర్ కిషోరీ పడ్నేకర్ తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ మూలంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆస్థిపన్నును పెంచడం లేదని ఆమె అన్నారు. పరిస్థితులు చక్కబడే వరకు ముంబై నగర ప్రజలపై అదనపు భారం మోపడం లేదన్నారు. నిజానికి ఇంటి పన్నును 14 శాతం పెంచనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. దీంతో నగర ప్రజలు హడలెత్తిపోయారు. ఇటీవల ఓ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ప్రాపర్టీ ట్యాక్సును దాదాపు 14 శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ముంబైలో మొత్తం 4.2 లక్షల మంది ప్రాపర్టీ ఓనర్లు ఉన్నారు. దాంట్లో 1.37 లక్షల ఇండ్లు దాదాపు 500 గజాల్లో ఉన్నాయి. చివరిసారి 2015లో ఆస్థిపన్నును పెంచారు.