హైదరాబాద్ : నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా ఉప్పల్, విద్యానగర్, రామంతాపూర్, తార్నాక తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దయింది. జోరు వాన నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరవాసులకు పలు సూచనలు చేశారు. నెమ్మదిగా వెళ్లాల్సిందిగా, వాహనాల హెడ్లైట్లు ఆన్చేసుకుని డ్రైవ్ చేయాల్సిందిగా సూచించారు. రహదారులపై వరద నీరు పారుతుండటంతో పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. దీంతో జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగింది. మొత్తం 19 డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్లు ఆయా ప్రాంతాల్లో మోహరించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాయి.
తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల వద్ద ఉపరితలద్రోణి ఆవరించి ఉంది. అదేవిధంగా ఉత్తర ఒడిశా నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో గత రెండు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి.