నల్లగొండ ప్రతినిధి, మార్చి17(నమస్తే తెలంగాణ) : నల్లగొండ పట్టణ పరిధిలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోదాంలో శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఎనిమిది హాళ్లు, ఒక్కో హాల్లో ఏడు టేబుళ్లపై మొత్తం 56 టేబుళ్లను లెక్కింపు కోసం ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్కు 13 బ్యాలెట్ బాక్సులను కేటాయించారు. వీటిని ఓపెన్ చేసి ముందుగా 25బ్యాలెట్ పేపర్ల చొప్పున కట్టలు కట్టారు. ఈ ప్రక్రియ ఉదయం 8నుంచి సాయంత్రం 5గంటల వరకు నిరాటంకంగా కొనసాగింది. ఇలా మొత్తం పోలైన 3,86,320 ఓట్లను కట్టలుగా చేశారు. ఇదే సమయంలో 1917 పోస్టల్ బ్యాలెట్లను కూడా 25 చొప్పున కట్టలుగా చేశారు. వీటిలో 79ఓట్లు చెల్లనివిగా నిర్ధారించారు. మిగతా చెల్లిన పోస్టల్ బ్యాలెట్లు 1838తోపాటు సాధారణంగా పోలైన 3,86,320 ఓట్లు కలిపి మొత్తం 3,88,011 ఓట్ల లెక్కింపును ప్రారంభించారు.
తొలి రౌండ్లో టీఆర్ఎస్ హవా
రెండో షిఫ్టు సిబ్బంది కౌంటింగ్ విధుల్లో చేరాక సాయంత్రం ఆరు గంటలకు తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఒక్కో టేబుల్కు వెయ్యి బ్యాలెట్ల చొప్పున కేటాయించి మొత్తం 56 టేబుళ్లపై కౌంటింగ్ను కొనసాగించారు. అంటే ఒక్కో రౌండ్లో 56వేల ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తున్నారు. ఇలా మొత్తం ఏడు రౌండ్లలో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఇదే సమయంలో రౌండ్ల వారీగా అభ్యర్థులకు వచ్చే ఓట్లను ఓ వైపు, చెల్లని ఓట్లను మరో బాక్స్లో వేస్తున్నారు. ఈ క్రమంలో తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో అన్ని టేబుళ్లపైనా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించారు. ఇక రెండో స్థానంలో తీన్మార్ మల్లన్న, మూడో స్థానంలో కోదండరామ్ కొనసాగుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి నాలుగో స్థానంలో, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్ ఐదో స్థానంలో ఉన్నారు.
ఏడు రౌండ్లలో లెక్కింపు
మొత్తం ఏడు రౌండ్లల్లో తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. ఏడు రౌండ్ల కౌంటింగ్ పూర్తి కావాలంటే గురువారం ఉదయం పది గంటలు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక చెల్లని ఓట్లను తీసివేసి చెల్లిన ఓట్లతో గెలుపు కోటాను నిర్ధారించనున్నారు. చెల్లిన ఓట్లలో 50శాతం+1ఓటు గెలుపు కోటా కానుంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరూ గెలుపు కోటాను చేరుకోక పోతే ఎలిమినేషన్ పద్ధతిలో కౌంటింగ్ కొనసాగనుంది. తొలి ప్రాధాన్యత ఓట్లలో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి వచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను ఇతర అభ్యర్థులకు పంచుతూ వస్తారు. ఇలా కోటా వచ్చే వరకూ కింది నుంచి ఒక్కో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ వారికి వచ్చిన రెండో ప్రాధాన్యత ఓట్లను పంచుకుంటూ లెక్కింపును కొనసాగిస్తారు. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి, కోదండరామ్, తీన్మార్ మల్లన్న, గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, రాములునాయక్తోపాటు ఇతర అభ్యర్థులంతా తొలి రౌండ్ లెక్కింపు ప్రక్రియను గమనిస్తూ కౌంటింగ్ హాల్స్లో కనిపించారు. సిట్టింగ్ స్థానంలో మరోసారి జయకేతనం ఎగురవేస్తామని టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ట్రెండ్ స్పష్టంగా వెల్లడవుతుందని చెప్పారు.