పుణే : కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో పుణే పింప్రి-చించ్వాడ్ ప్రాంతంలో సంభవించిన మరణాల్లో 30 శాతం మంది బాధితులకు గతంలో ఎలాంటి వ్యాధులు లేవని వీరు కేవలం కరోనా ఇన్ఫెక్షన్ తోనే కన్నుమూశారని అధికారులు వెల్లడించారు. మరణాల్లో మూడింట ఒక వంతు మందికి గతంలో ఎలాంటి వ్యాధులు లేవని, వారిలో చాలామంది యువకులు ఉన్నారని తేలింది. వైరస్ తో మరణించిన వారిలో 66 శాతం మందికి హైపర్ టెన్షన్ ఉండగా, 44 శాతం మంది మధుమేహులని గుర్తించినట్టు పుణే మున్సిపల్ కమిషనర్ రాజేష్ పాటిల్ తెలిపారు.
స్వల్ప వ్యవధిలోనే రోగుల ఆరోగ్య పరిస్థితి క్షీణించినట్టు వైద్య నిపుణుల పరిశోధనలో వెల్లడైందని ఆయన వివరించారు. ప్రజలు కొవిడ్-19 నిబంధనలు పాటించడం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కరోనా పరీక్షలు చేయింకోవడంలో జాప్యం చేయడం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోయిన తర్వాతే దవాఖానలకు చేరడం వంటి కారణాలతో మరణాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయని తెలిపారు. తీవ్ర లక్షణాలున్న రోగులు కూడా ఇండ్లలోనే చికిత్స తీసుకుని ఆఖరి నిమిషంలో ఆస్పత్రుల్లో చేరారని చెప్పుకొచ్చారు.