ముషీరాబాద్, జూన్ 3: వర్షాకాలంలో ఎటువంటి విపత్కర పరిస్థితితులు ఎదురైనా వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించడానికి అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. గురువారం ముషీరాబాద్ క్రీడా మైదానంలో వర్షాకాలపు అత్యవసర సేవల కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వర్షాకాలం మొదలైన నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బస్తీలు, కాలనీల్లో వరద సమస్య తలెత్తినా, రోడ్లపై వరద నీరు నిలిచి ఉన్నా వెంటనే తొలగించాలని అన్నారు. అదేవిధంగా వరదలకు రోడ్లపై గుంతలు ఏర్పడినా, ఇసుక పేరుకుపోయినా యుద్ధ ప్రాతిపదికన తొలగించి వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగకుండా చూడాలని కోరారు. వరద ముంపు ప్రభావిత ప్రాంతాలు, నాలా పరీవాహక ప్రాంతాల్లో వరద నీరు సాఫీగా వెళ్లేలా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా ఇంకా మిగిలి ఉన్న వరద నీటి పైపులైన్లలో పూడికతీత పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సర్కిల్-15 డిప్యూటీ కమిషనర్ హరిక్రిష్ణ, ఈఈ శ్రీనివాస్, డీఈ సన్నీ, ఏఈలు తిరుపతి, మురళి, శ్రావణి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, ఎయిర్టెల్ రాజు, హమ్మదుల్లా, శ్రీకాంత్ ముదిరాజ్, లక్ష్మణ్ గౌడ్, గోవింద్, జావిద్, శ్రీకాంత్గౌడ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
ముషీరాబాద్: ముషీరాబాద్ చేపల మార్కెట్లో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ గురువారం పరిశీలించారు. రోడ్డు పనులు సాగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన వర్షాకాలం మొదలైన నేపథ్యంలో రోడ్డు నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. చేపల మార్కెట్లో పారిశుధ్య సమస్య తలెత్తకుండా చూడటంతోపాటు రోడ్డు నిర్మాణం పూర్తయ్యే వరకు వ్యాపారాలకు ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సర్కిల్-15 ఈఈ శ్రీనివాస్, డీఈ సన్నీ, ఏఈలు తిరుపతి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జయసింహ, ఏయిర్టెల్ రాజు, హమ్మదుల్లా, కాడబోయిన నర్సింగ్ ప్రసాద్, మీసాల ప్రసాద్, దీన్దయాల్రెడ్డి, రుద్ర ప్రవీణ్, డింభ, శ్రీకాంత్ ముదిరాజ్, లక్ష్మణ్గౌడ్, గోవింద్, జావిద్, శ్రీకాంత్గౌడ్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి: కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవలందించిన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం చైర్మన్ ముచ్చకుర్తి ప్రభాకర్ దంపతులను గురువారం ఎమ్మెల్యే ముఠా గోపాల్ సన్మానించారు.