ఓటీటీ ప్లాట్ఫామ్ రెన్యువల్పై ఆర్బీఐ రూల్స్
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: వినియోగదారుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు వాటంతట అవే (ఆటోమెటిగ్గా) కట్ అయ్యే విధానానికి స్వస్తిపలికే ప్రక్రియలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ 1 నుంచి ‘ఓటీటీ ప్లాట్ఫామ్ ఆటోమెటిక్ రెన్యువల్’ కుదరదని కొత్త నిబంధనల్లో స్పష్టం చేసింది. వినియోగదారుడి ఖాతా నుంచి ఆటోమెటిక్గా డబ్బులు కట్ అయ్యే 24 గంటల ముందుగా బ్యాంకులు విధిగా ఖాతాదారుడికి ఎస్సెమ్మెస్ లేదా మెయిల్ రూపంలో సమాచారం అందించాలన్నది. అడిషనల్ ఫ్యాక్టర్ ఆఫ్ అథెంటికేషన్ (ఏఎఫ్ఏ) మెసేజ్ను పంపించి, ఖాతాదారుడితో ధ్రువపర్చుకున్నాకనే అకౌంట్ నుంచి డబ్బులను కట్ చేయాలని తెలిపింది. తొలుత ఓటీటీ ప్లాట్ఫామ్స్కు ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది. నెట్ఫ్లిక్స్, అమెజాన్, హాట్స్టార్ వంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ నెలవారీ ప్యాకేజీ అయిపోగానే, సబ్స్క్రిప్షన్ రెన్యువల్కు వినియోగదారుడి ఖాతా నుంచి ఆటోమెటిగ్గా డబ్బులు కట్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆర్బీఐ ఈ నిబంధనలు తీసుకొచ్చింది. రూ.5 వేలకు మించి పేమెంట్లు చేయాల్సివస్తే ఓటీపీని కూడా తప్పనిసరి చేసింది.