Coronavirus recovery : కరోనా ఇప్పుడు దేశాన్ని పట్టిపీడిస్తోంది ! ప్రతి రోజు లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అదృష్టం ఏంటంటే.. 80 శాతం మంది ఆస్పత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లో చికిత్స తీసుకోవడం ద్వారానే కోలుకుంటున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్నా వైరస్ తాలూకూ ప్రభావం ఇంకా మనపై ఉంటుంది. వైరస్ ప్రభావం వల్ల నెగెటివ్ వచ్చినా తర్వాత కూడా కొద్దిరోజుల పాటు నీరసంగానే ఉంటుంది. కాబట్టి కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా శారీరకంగా, మానసికంగా దృఢంగా అయ్యేందుకు కొద్దిరోజుల పాటు పలు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ఎలాగూ కరోనా నెగెటివ్ వచ్చింది కదా అని డైట్ను నిర్లక్ష్యం చేయకూడదు. దానిమ్మ, ఆరెంజ్, యాపిల్, బొప్పాయి, ఇతరత్రా పండ్లను రెగ్యులర్గా తినాలి. నీరసం తగ్గాలంటే పండ్ల రసాలు కూడా తాగడం మంచిది. ఇంకా కుదిరితే ఉదయం పూట పండ్లు తిని, సాయంత్రం జ్యూస్ తాగడం మంచిది. దీనివల్ల పండ్లను తీసుకునే శాతం పెరుగుతుంది.
నీరసాన్ని తగ్గించి, ఎముకలను దృఢంగా మార్చడంలో పాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. కాబట్టి ప్రతిరోజు పడుకునే ముందు పాలు తాగడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి వస్తుంది. వేడి పాలల్లో చిటికెడు పసుపు వేసుకుని తాగితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
కూరగాయల్లో కావాల్సినన్ని విటమిన్లు, పోషకాలు లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. క్యారెట్, టమాటో, బీట్రూట్ వంటి వాటిల్లో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని జ్యూస్ చేసుకుని తాగడం ద్వారా శరీరానికి కావాల్సినంత ఎనర్జీ వస్తుంది. నీరసం దూరమవుతుంది.
రోజూ ఆవిరి పట్టుకోవడం వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా శ్వాస కోశ సమస్యలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. కాబట్టి కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా రోజుకు రెండు నుంచి మూడుసార్లు ఆవిరి పట్టుకోవడం మంచిది.
కరోనా సోకినప్పుడు ఇమ్యూనిటీ పెరిగేందుకు విటమిన్ సీ, జింక్, ఇతరత్రా మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లను వైద్యులు ఇస్తారు. అయితే కరోనా నెగెటివ్ రాగానే వీటిని వాడటం మానేయద్దు. నీరసం తగ్గి పూర్తిగా కోలుకునేంతవరకు ఈ విటమిన్ ట్యాబ్లెట్లు వాడాలి. ఇవి శరీరంలో పేరుకుపోయిన ట్యాక్సిన్లను తొలగిస్తాయి.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎక్కువగా నీరసంగా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి శరీరంలో ఉండే నీటి శాతం తగ్గి డీహైడ్రేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగాలి. డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తాగితే ఎక్కువ ఫలితం ఉంటుంది.
కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కొద్దిరోజుల పాటు ఎప్పటికప్పుడు ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేసుకోవాలి. పూర్తిగా కోలుకునే వరకు ఇంటి సభ్యులకు దూరంగానే ఉండాలి. ఇంట్లో ఉన్నా మాస్క్ ధరించాలి. నెగెటివ్ వచ్చిన తర్వాత పదిరోజుల పాటు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకోవడం మంచిది.
నెగెటివ్ వచ్చిన వెంటనే చాలామంది రోజువారీ పనులకు వెళ్లిపోతుంటారు. కానీ నెగెటివ్ వచ్చినప్పటికీ ఇంకా పూర్తిగా కోలుకోలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెగెటివ్ వచ్చిన తర్వాత కూడా పలు అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. అవి తగ్గడానికి కొద్దిగా సమయం పడుతుంది. కాబట్టి వెంటనే వర్క్లో పడి ఒత్తిడిని పెంచుకోవద్దు. విశ్రాంతి చాలా అవసరం. అతిగా వ్యాయామం కూడా చేయవద్దు. వాకింగ్ చేస్తే సరిపోతుంది.
కొవిడ్-19 కారణంగా ఊపిరితిత్తులు చాలా ప్రభావితం అవుతాయి. కాబట్టి వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇందుకోసం యోగా, బ్రీతింగ్ వంటి వ్యాయామాలు చేయాలి.
ఏ ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నా సరే దాని తాలుకూ ప్రభావం కొద్దిరోజుల పాటు మనపై అలాగే ఉంటుంది. కాబట్టి శారీరకంగానే కాకుండా మానసికంగా ఆరోగ్యంగా, దృఢంగా ఉండటం చాలా అవసరం. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ధ్యానం చేయాలి. పాజిటివ్గా ఆలోచించాలి. అనవసర భయాలకు లోనవద్దు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Oxygen : కరోనా టైంలో ఈ మొక్కలు ఇంటికి తెచ్చుకోండి.. ఆక్సిజన్ పొందండి
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
Covid-19 deaths : కరోనా మృతుల అంత్యక్రియలకు వెళ్లొచ్చా? లేదా?
Corona Vaccine: వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలి?
బోర్లా పడుకుంటే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయా.. ఆ వైరల్ వీడియోలో నిజమెంత?
Corona effect : ఆక్సిజన్ లెవల్స్ ఎలా పెంచుకోవాలి
Corona Effect | శ్మశాన వాటికలకు హౌస్ ఫుల్ బోర్డులు..
COVID-19 Lung Damage : ఊపిరితిత్తుల మాట వినండి!