కోల్కతా: యాస్ తుఫాన్ ఇవాళ ఒడిసాలోని బాలాసోర్ వద్ద తీరం దాటింది. ఉదయం 10.30 నిమిషాల నుంచి 11.30 నిమిషాల మధ్య తుఫాన్ తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. అయితే ఆ తుఫాన్ వల్ల సుమారు కోటి మంది ప్రభావానికి లోనైనట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. యాస్ తుఫాన్ వల్ల వాతావరణ పరిస్థితులు అసాధారణంగా ఉన్నాయని, సముద్రం అల్లకల్లోలంగా తయారైనట్లు ఆమె చెప్పారు. సుమారు 15 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆమె తెలిపారు. బెంగాల్లో యాస్ తుఫాన్ వల్ల మూడు లక్షల ఇండ్లు ధ్వంసం అయినట్లు సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. తుఫాన్ వల్ల తీవ్ర ప్రభావానికి లోను అయిన పర్బా మిడ్నాపూర్, సౌత్ అండ్ నార్త్ పర్గనాస్ జిల్లాల్లో శుక్రవారం పర్యటించనున్నట్లు ఆమె వెల్లడించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు సుమారు కోటి విలువైన సహాయక సామాగ్రిని పంపించినట్లు ఆమె చెప్పారు.