హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో మే 16 (నమస్తే తెలంగాణ)/కేపీహెచ్బీ కాలనీ: రాష్ట్రంలో దవాఖానలకు ఆక్సిజన్ సరఫరాపై ప్రభుత్వం మరింత దృష్టి కేంద్రీకరించింది. అన్ని దవాఖానలకు ప్రాణవాయువును సకాలంలో అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. అవసరాలకు సరిపడా ఆక్సిజన్ను సమకూర్చుకోవడమే కాకుండా, దానిని ఏ దవాఖానకు, ఏ జిల్లాకు ఎంత అవసరమో గుర్తించి, ఆ మేరకు సకాలంలో పంపించే ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారుల బృందాలను నియమించింది. రెవెన్యూ, పరిశ్రమలు, వైద్యారోగ్య, పోలీస్శాఖల సమన్వయంతో ఆక్సిజన్ సరఫరా కు ఎక్కడా అంతరాయం కలుగకుండా ఈ బృం దం పర్యవేక్షిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా దవాఖానల్లో రోజువారీగా ఎంతమంది రోగులున్నారు? ఎందరికి ఎంత ఆక్సిజన్ అవసరం ఉన్నది? దవాఖానల వద్ద ఉన్న స్టాక్ ఎంత? అనే వివరా లు సేకరించి తదనుగుణంగా పంపిణీ చేస్తున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక బృందా లు ఆక్సిజన్ సరఫరాను పర్యవేక్షిస్తున్నాయి.
హైదరాబాద్లో ఆన్లైన్ మానిటరింగ్
హైదరాబాద్లో దవాఖానల ఆక్సిజన్ అవసరాలను ఆన్లైన్ విధానంలో పరిశీలిస్తున్నారు. దీంతోపాటు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన టీంలు ఆయా దవాఖానల అవసరాలను తెలుసుకొని సరఫరాలో ఇబ్బందులు రాకుండా మానిటరింగ్ చేస్తున్నారు. ఆన్లైన్ యాక్సెస్ అంతా జిల్లా కలెక్టర్ చేతిలో ఉంటుంది. దవాఖానలు తమకు ఎంతమేర ఆక్సిజన్ అవసరమున్నది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆక్సిజన్ ఎంతమంది పేషెంట్లకు ఇచ్చారు. వారికి ఇంకా ఎంత అవసరం? తదితర సమగ్ర వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాయి. దీంతో దవాఖానలో ఏ రోగికి ఎంత ఆక్సిజన్ వాడారన్నది కూడా తెలుస్తుంది. దీనిద్వారా మానిటరింగ్ టీంలు ఏ దవాఖానకు ఎంత ఆక్సిజన్ అవసరమో గుర్తించి, ఆ మేరకు సకాలంలో సరఫరా అయ్యేలా చూస్తారు. ఇదే సమయంలో మానిటరింగ్ గ్రూప్లోని వైద్యారోగ్యశాఖ సభ్యులు ఆయా దవాఖానలకు ఫోన్చేసి ఆక్సిజన్ నిల్వ, డిమాండ్ వివరాలు తెలుసుకొంటారు. అనంతరం ఆక్సిజన్ సరఫరాచేసే ఏజెన్సీలను అప్రమత్తం చేసి సకాలంలో పంపిస్తారు. ఏ కారణంతోనైనా ఏదైనా దవాఖానకు సకాలంలో ఆక్సిజన్ అందకపోతే అందుకు కారణాలు తెలుసుకొని, సమస్యలను వెంటనే పరిష్కస్తారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరిగి, ఆక్సిజన్ అవసరాలు పెరిగినప్పటి నుంచి ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఆక్సిజన్ సరఫరాను మానిటరింగ్ చేస్తున్నది. ఆక్సిజన్ కొరతను గుర్తించి సీఎం కేసీఆర్ వెంటనే వాయుమార్గంలో ట్యాంకర్లను ఒడిశాకు పంపి ఆక్సిజన్ తెప్పించారు. తాజాగా మరో 200 టన్నుల ఆక్సిజన్ రాష్ర్టానికి వచ్చేలా కృషిచేశారు. దాంతో రాష్ట్రంలో ఆక్సిజన్ ఇబ్బందులు లేకుండా సరఫరా అవుతున్నది.
120 టన్నుల ఆరో ఆక్సిజన్ రైలు రాక
ఒడిశానుంచి తెలంగాణకు ఆరో ఆక్సిజన్ రైలు చేరుకొన్నది. ఆదివారం 120 టన్నులు మెడికల్ ఆక్సిజన్తో ఈ రైలు సనత్నగర్కు చేరింది. ఒడిశానుంచి గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేసి రైలును నడిపినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఏడో ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైలు సోమవారం హైదరాబాద్కు చేరుకోనున్నట్టు లిండే ఇండియా లిమిటెడ్ ప్రతినిధి శంకర్ తెలిపారు.
ప్రతి నిమిషం పర్యవేక్షణ: డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి
ఆక్సిజన్ సరఫరాను మినిట్ టూ మినిట్ మానిటరింగ్ చేస్తున్నామని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్రెడ్డి తెలిపారు. 500 టన్నుల ఆక్సిజన్ కావాలని కేంద్రాన్ని అడిగామని, ప్రస్తుతం మనకు రోజు 420 నుంచి 440 టన్నులు సరఫరా అవుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో 125 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్నదని వివరించారు. ఎక్కువభాగం మనకు ఒడిశా నుంచి వస్తున్నదని తెలిపారు. ఆక్సిజన్ను ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లోని రోగులందరికీ సరిపోయేలా పంపిణీ చేస్తున్నామన్నారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులు రాష్ర్టానికి వచ్చే ఆక్సిజన్ను మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. ఆక్సిజన్ వృథా కాకుండా వారంనుంచి ఆడిటింగ్ చేస్తున్నామని, రియల్ టైమ్లో ఎంత అవసరం ఉంటుందో అంతవరకే వినియోగించాలని చెప్పామని వెల్లడించారు. ఆక్సిజన్ స్టోరేజీ, ఉత్పత్తికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామన్నారు. గతేడాది రాష్ట్రంలో 10వేల ఆక్సిజన్ పడకలుండేవని, మరో 7,300 ఆక్సిజన్ పడకలు పెంచుతున్నామని తెలిపారు.
హైదరాబాద్లో 2,300, జిల్లాల్లో 5,000 ఆక్సిజన్ పడకలు పెరుగుతున్నాయని, ఇవి అతిత్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. క్రయోజనిక్ సిలిండర్లను పెంచుతున్నామని, వాటిద్వారా దవాఖానల్లో ఆక్సిజన్ స్టోరేజీ సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. ఒక్క క్రయోజనిక్ సిలిండర్లో ఆక్సిజన్ నింపితే మామూలు పరిస్థితుల్లో మూడురోజులు, ప్రస్తుత పరిస్థితిలో ఒక్క సిలిండర్ 18 నుంచి 24 గంటల వరకు వస్తుందని చెప్పారు. డీ టైప్ సిలిండర్లు 2 వేలవరకు ఉన్నాయని, కొత్తగా 500 వచ్చాయని, మరో 500 త్వరలో వస్తాయన్నారు. ఆక్సిజన్ ఉత్పత్తిచేసే జనరేటర్లు హైదరాబాద్లో గాంధీ, కరీంనగర్ దవాఖానల్లో ఏర్పాటుచేస్తున్నామని వివరించారు. గాంధీలో ఉత్పత్తి మొదలుపెట్టినట్టు వెల్లడించారు. ఫ్రాన్స్ సహకారంతో టిమ్స్లో ఆక్సిజన్ జనరేటర్ ఏర్పాటుచేశామన్నారు. ఇది వంద ఆక్సిజన్ సిలిండర్లను నింపుతుందని చెప్పారు. 51 ప్రాంతాల్లో ఆక్సిజన్ ఉత్పత్తిచేసే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.