పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తోపాటు మరి కొందరు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీకానున్నారు. కులం ప్రతిపాదికన జనాభా గణన నిర్వాహించాలని కోరుతూ సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలో అఖిలపక్ష బృందం మోదీని కలువనున్నది. ‘గౌరవనీయులైన ప్రధానమంత్రి సోమవారం ఉదయం 11 గంటలకు సమయం ఇచ్చారు. రాష్ట్రంలోని పది పార్టీల సభ్యులతోపాటు జాబితాలోని ప్రతినిధి బృందం మోదీతో సమావేశమవుతుంది’ అని నితీశ్ కుమార్ శనివారం పాట్నాలో మీడియాతో అన్నారు. కులాల ఆధారంగా జనాభా గణన నిర్వహించాలని తాము కోరనున్నట్లు చెప్పారు. అయితే దీనిపై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కులాల ఆధారంగా జనాభా గణన దేశవ్యాప్తంగా నిర్వహిస్తే చాలా ఉపయోగమన్నారు. దేశ వ్యాప్తంగా దీనిని నిర్వహించని పక్షంలో బీహార్ రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. దీని కోసం అఖిలపక్షంతో కలిసి ప్రధాని అనుమతి కోరుతామని నితీశ్ కుమార్ ఇటీవల అన్నారు.