బంగారం కొనుగోళ్లు అంతంతే
లాక్డౌన్లతో మూతబడ్డ దుకాణాలు
ముంబై, మే 14: అక్షయ తృతీయకు కరోనా సెగ తగిలింది. దేశవ్యాప్తంగా చాలా రాష్ర్టాల్లో లాక్డౌన్లు, కర్ఫ్యూల మధ్య శుక్రవారం బంగారం కొనుగోళ్లు అంతంతమాత్రంగానే జరిగాయి. కొవిడ్-19కు ముందున్న అమ్మకాల (2019 అక్షయ తృతీయ)తో పోల్చితే ఈసారి అందులో దాదాపు 10 శాతంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఆభరణాల వర్తకులు చెప్పడం మార్కెట్ పరిస్థితికి అద్దం పడుతున్నది. గతేడాది కూడా అక్షయ తృతీయ వ్యాపారాన్ని మహమ్మారి మింగేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుసగా రెండో ఏడాదీ నిరాశే మిగిలిందని జ్యుయెల్లర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుకింగ్స్, ఎంక్వైరీలు టెలీఫోన్ లేదా డిజిటల్ మాధ్యమాల ద్వారానే జరిగాయని, కస్టమర్లు దుకాణాలకు పెద్దగా రాలేదని, 90 శాతం రాష్ర్టాల్లో రిటైల్ షాపులు తెరుచుకోలేదని అఖిల భారత రత్నాలు, ఆభరణాల దేశీయ మండలి చైర్మన్ ఆశిష్ పీతే తెలిపారు. భారీ మార్కైట్లెన మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ, ఏపీ, కేరళల్లో రిటైల్ స్టోర్లు దాదాపుగా మూతబడ్డాయన్నారు. రాష్ట్రంలో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు 4 గంటలపాటే తెరుచుకున్నాయి. కాగా, అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోళ్లు శుభప్రదమని భారతీయుల భావన. అందుకే ఈరోజుపై నగల వ్యాపారులు పెద్ద ఎత్తునే ఆశలు పెట్టుకుంటారు. కానీ కరోనా ఈ ఆశల్ని ఆవిరి చేస్తున్నది. సాధారణంగా దేశంలో అక్షయ తృతీయనాడు 25-30 టన్నుల బంగారం అమ్ముడవుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు 3-4 టన్నులకే పరిమితమైనట్లు అంచనాలు వస్తున్నాయి. నిరుడు 2-2.5 టన్నుల అమ్మకాలే జరిగాయని వ్యాపారులు చెప్తున్నారు. మరోవైపు భౌతికంగా బంగారాన్ని కొనలేని వారంతా.. గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఫండ్స్, ఈ-గోల్డ్ల్లో పెట్టుబడులకు కొంత ఆసక్తి చూపించినట్లు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి.