న్యూఢిల్లీ: కోవిడ్-19 వైరస్ తన ఇదేరీతిన మార్పులకు గురవుతూ పోతే భారత్లో మూడో విడత కరోనా కల్లోలం కూడా రావచ్చని అఖిలభారత వైద్యశాస్త్రాల సంస్థ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. అయితే టీకాలు చాలామందికి చేరగలిగితే దీని ప్రభావం అంతగా ఉండకపోవచ్చని చెప్పారు. రాత్రి కర్ఫ్యూలు, వారాంతపు లాక్డౌన్ల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. తగిన గడువుతో లాక్ డౌన్ విధిస్తే ఫలితం ఉండొచ్చని తెలిపారు. కనీసం రెండు వారాలు లాక్డౌన్ కటినంగా అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మూడు విషయాలు గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. “అందులో మొదటిది వైద్య సౌకర్యాలను మెరుగుపర్చుకోవడం. రెండోది తీవ్రమైన చర్యలు తీసుకుని కేసుల సంఖ్య భారీగా తగ్గించుకోవడం. ముడోది టీకాలు అందరికీ వేయడం” అని ఆయన చెప్పారు. మనుషుల మధ్య దూరాన్ని పాటించగలిగితే వ్యాప్తిని అరికట్టవచ్చని అన్నారు.