న్యూఢిల్లీ : ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా దేశంలో థర్డ్ వేవ్ తలెత్తకుండా నివారించగలమని నీతిఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ అన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డగించి అది తాజా మార్పులకు లోనవకుండా ఉండేందుకు మహమ్మారిని పలు విధాలుగా ఎదుర్కోవాలని స్పష్టం చేశారు. వైరస్ స్వాభావికంగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఉంటుందని, అది ఉనికిలో ఉండేందుకు అతిథేయ శరీరాలను ఎంచుకుంటుందని చెప్పారు. మనం వ్యాక్సినేషన్ పూర్తిచేసుకోవడం, గతంలో వ్యాధి సోకి ఉండటం ద్వారా మహమ్మారి నుంచి రక్షణ పొందని పక్షంలో వైరస్ టార్గెట్గా కొనసాగుతామని అన్నారు.
వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంలో వ్యాక్సినేషన్ అందుకే కీలక ఆయుధమని డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. వైరస్ వేగంగా మ్యుటేట్ అవుతూ రెట్టింపు సంఖ్యలో వ్యాప్తి చెందుతూ పోతుందని దాన్ని ఎవరూ అంచనా వేయలేరని అన్నారు. వైరస్కు మనం ఎన్నడూ అవకాశం ఇవ్వరాదని, మనమంతా కలిసి గుమికూడటం, కలసి భోజనం చేయడం, మాస్క్లు లేకుండా అందరూ కలిసి కూర్చోవడం వంటి పనులతో వైరస్ వ్యాప్తికి మరింత అవకాశం ఇచ్చినట్టు అవుతుందని అన్నారు. ప్రజలు వైరస్కు లోనయ్యే అవకాశం ఇవ్వకుండా వ్యాక్సినేషన్ పూర్తిచేసుకోవడం, మాస్క్లు ధరించి, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు అనుసరిస్తే థర్డ్ వేవ్ రాదని స్పష్టం చేశారు.