న్యూఢిల్లీ: డిపాజిట్ల చెల్లింపులో బ్యాంకు విఫలమైనా, బ్యాంకుపై మారటోరియం విధింపు జరిగినా, ఇక నుంచి డిపాజిటర్లకు రూ.5 లక్షల వరకూ ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఈ మేరకు డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) చట్ట సవరణ బిల్లును బుధవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఈ సవరణ బిల్లును ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 1993 నుంచీ రూ. 1 లక్ష డిపాజిట్పై మాత్రమే ఇన్సూరెన్స్ అమలవుతోంది. బిల్లు చట్టంగా రూపొందిన తర్వాత, బ్యాంకు విఫలమైనప్పటి నుంచి 90 రోజుల్లోనే ఈ డిపాజిట్ చెల్లింపు జరుగుతుంది. వాస్తవానికి గతేడాది పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీబ్యాంక్)ను మూసివేసిన సందర్భంగా ఆ డిపాజిటర్లకు మద్దతుగా డిపాజిట్లపై ఇన్సూరెన్స్ రక్షణను రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షలవరకూ ప్రభుత్వం పెంచింది. ఆ సమయంలోనే యస్ బ్యాంక్, లక్ష్మి విలాస్ బ్యాంక్లు దివాలా అంచులవరకూ వెళ్లగా, ప్రభుత్వం, రిజర్వుబ్యాంక్లు కలిసి ఆ రెండు బ్యాంకుల్ని పునర్వ్యవస్థీకరణ ద్వారా గట్టెక్కించాయి. రిజర్వుబ్యాంక్కు పూర్తిస్థాయి సబ్సిడరీ అయిన డీఐసీజీసీ… బ్యాంకు డిపాజిట్లకు ఇన్సూరెన్స్ భద్రతను కల్పిస్తుంది.
అన్ని బ్యాంకులకూ…అన్ని డిపాజిట్ ఖాతాలకూ…
భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ బ్యాంకు శాఖలతో సహా అన్ని వాణిజ్య బ్యాంకుల్లో పొదుపు చేసుకున్న అన్ని ఫిక్స్డ్, కరెంట్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లనూ డీఐసీజీసీ ఇన్సూర్ చేస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. సవరణ చట్టాన్ని అనుసరించి అసలు, వడ్డీతో కలిపి గరిష్ఠంగా రూ.5 లక్షలవరకూ బ్యాంకు డిపాజిట్లకు బీమా ఉంటుందని, దేశంలోని 98.3 శాతం డిపాజిట్ ఖాతాలకు, 50.9 శాతం డిపాజిట్ల విలువకు రక్షణ లభిస్తుందని సీతారామన్ వివరించారు.
90 రోజుల్లోనే చెల్లింపు…
వైఫల్యమైన బ్యాంక్కు చెందిన డిపాజిటర్లు…ఇన్సూరెన్స్ సొమ్మును, ఇతర క్లయిములను పొందడానికి ప్రస్తుతం 8-10 సంవత్సరాల సమయం పడుతోంది. ఇక నుంచి మారటోరియం విధింపునకు గురైన బ్యాంకు నుంచి చెల్లించాల్సిన డిపాజిట్ ఖాతాల క్లయిముల్ని 45 రోజుల్లో సేకరించి, బీమా సంస్థకు పంపించడం జరుగుతుందని, వివరాలన్నీ సరిచూసుకొని బీమా సంస్థ 90వ రోజుకల్లా సొమ్ము ఖాతాదారులకు చెల్లిసుందని సీతారామన్ తెలిపారు. ప్రతీ రూ.100 డిపాజిట్ మొత్తంపై 10 పైసలు బీమా ప్రీమియంగా ఇప్పటివరకూ బ్యాంకు చెల్లించేదని, ఈ మొత్తాన్ని 12 పైసలకు పెంచినట్లు మంత్రి చెప్పారు.
ఎల్ఎల్పీ చట్ట సవరణకూ ఓకే…
దేశంలో వ్యాపార నిర్వహణను సరళతరం చేసేదిశగా లిమిటెడ్ లయబిలిటీ పార్టనర్షిప్ (ఎల్ఎల్పీ) చట్ట సవరణ బిల్లును కూడా క్యాబినెట్ ఆమోదించినట్లు సీతారామన్ తెలిపారు. ఎల్ఎల్పీ చట్టాన్ని అమలుచేసే కార్పొరేట్ వ్యవహారాల శాఖకు ప్రస్తుతం సీతారామనే ఇన్ఛార్జ్గా ఉన్నారు. నిబంధనల పాటించకపోతే తీసుకునే క్రిమినల్ చర్యల్ని సవరణ చట్టంలో తొలగించారు. జరిమానా, ఇతర చర్యల్ని తీసుకునే సందర్భాల్ని 22కు తగ్గించారు.