కొచ్చిన్: కొచ్చిన నౌకాశ్రయంలో నిర్మాణం అవుతున్న స్వదేశీ యుద్ధనౌక (ఇండీజీనియస్ ఎయిర్క్రాఫ్ట్ కేరీర్) పనులను ఇవాళ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. ఐఏసీ ఇండియాకు గర్వకారణంగా నిలుస్తుందని, ఆత్మనిర్బర్ భారత్కు మంచి ఉదహరణగా మారుతుందని ఆయన అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు శరవేగంగా సాగుతున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది స్వదేశీ యుద్ధ నౌకను జలప్రవేశం చేయనున్నామని, ఇది 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలకు నివాళిగా నిలుస్తుందన్నారు. ఐఏసీలో ఉన్న యుద్ధ సామర్థ్యం, వైవిధ్యం దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ తెలిపారు.
గురువారం రోజున మంత్రి రాజ్నాథ్.. కర్వార్ కూడా వెళ్లారు. అక్కడ ఆయన ప్రాజెక్ట్ సీబర్డ్ను సమీక్షించారు. భవిష్యత్తులో సీబర్డ్ అతిపెద్ద నావల్ బేస్గా మారుతుందని ఆయన చెప్పారు. హిందూ మహాసముద్రంలో భారత్ చేపట్టే ప్రాజెక్టులకు ఈ బేస్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. నేవీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భారతీయ నౌకాశ్రయాల్లో ప్రస్తుతం 42 యుద్ధనౌకలను నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆధునీకరణ వల్ల నేవీ ఎప్పుడూ అప్రమత్తంగా ఉండ గలుగుతుందని, గాల్వాన్ ఘర్షణ సమయంలో నౌకాదశం అప్రమత్తం కావడం మన దేశ సత్తాను చాటిందన్నారు.
కోవిడ్ వేళ ఆపరేషన్ సేతుసముద్రం విదేశాల్లో చిక్కుకున్నవారిని రక్షించిందన్నారు. భారతీయ పౌరలను తీసుకురావడంతో పాటు సముద్ర మార్గంలో ఆక్సిజన్ సరఫరా కూడా వేగంగా జరిగిందని మంత్రి రాజ్నాథ్ తెలిపారు.