జైపూర్ : మహిళలు, గ్రామీణ ప్రాంతాలు, రైతులను దృష్టిలో ఉంచుకుని రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ తన బడ్జెట్ను సిద్ధం చేశారు. బుధవారం ఆయన రాష్ట్ర అసెంబ్లీలో 2021-22 బడ్జెట్ ప్రసంగం చేశారు. మహిళలకు ఉచితంగా న్యాప్కిన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో నడిపేందుకు కొత్త బస్సులను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించారు. రాజస్థాన్లో ఇటీవల చనిపోయిన నలుగురు ఎమ్మెల్యేల (ముగ్గురు కాంగ్రెస్, ఒక బీజేపీ) పేరిట జూనియర్ కాలేజీలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. బడ్జెట్ ప్రసంగంలో పలుమార్లు ప్రతిపక్ష పార్టీపై వ్యంగ్యాస్త్రాలు వదిలిన గెహ్లాట్.. బడ్జెట్ చదువుతున్న తాను కేవలం ఏడు సార్లు నీళ్లు తాగాను కానీ, మాజీ ముఖ్యమంత్రి రాజే అయితే అసలే నీళ్లు తాగలేదని చెప్పారు.
బాలికలకు ఇస్తున్నట్లుగానే రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఉచితంగా న్యాప్కిన్లు ఇవ్వనున్నారు. దీనికి మొత్తం రూ.200 కోట్ల నిధులు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త బస్సులను నడపాలని నిర్ణయం. తాగునీటి కోసం తూర్పు రాజస్థాన్ కాలువ ప్రాజెక్టును నిర్మించేందుకు రూ.37 వేల కోట్ల ఖర్చుతో చేపట్టేందుకు నిర్ణయం. వ్యవసాయ విద్యుత్ కోసం కొత్త విధానాన్ని అమలుచేయనున్నారు. రెండు నెలలకు ఒకసారి బిల్లులు వచ్చేలా కొత్త విద్యుత్ విధానం. తొలుత 50 వేల మంది రైతులకు కొత్త కనెక్షన్లు ఇవ్వనున్నారు. రైతులకు వడ్డీ లేని రుణాల పంపిణీకి రూ.16 వేల కోట్లు కేటాయించారు. రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చేందుకు ఇందిరాగాంధీ అర్బన్ క్రెడిట్ కార్డులను ప్రవేశపెట్టనున్నారు. చిన్న వ్యాపారులకు రూ.50 కోట్ల వడ్డీ రాయితీ ఇవ్వనున్నారు. స్టార్టప్లు ప్రారంభించేవారికి ఆర్థిక సాయంగా రూ.5 లక్షలు ఇవ్వనున్నారు. మరో 50 ప్రభుత్వ పాఠశాలల్ని తెరవడం, 100 పాఠశాలల్ని అప్గ్రేడ్ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బోధనా సామగ్రితోపాటు పుస్తకాలు, యూనిఫాం ఉచితంగా అందజేస్తారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ టీవీలు, సెట్టాప్ బాక్సులను అమర్చుతారు. నగదు రహిత వైద్య చికిత్స కోసం రూ.3500 కోట్ల వ్యయంతో యూనివర్సల్ హెల్త్ స్కీం తీసుకురానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభించేందుకు, పలు జిల్లా కేంద్రాల్లో దవాఖానలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోనున్నరు. జోథ్పూర్లో రూ.400 కోట్ల వ్యయంతో థింక్ట్యాంక్ కేంద్రాన్ని తెరువనున్నారు. రాజీవ్గాంధీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ల్యాబొరేటరీల ఏర్పాటుకు రూ.200 కోట్లు కేటాయించారు.