లక్నో: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య అంతకంతకే పెరిగిపోతున్నది. గత వారం రోజులుగా ప్రతిరోజు లక్షకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా లక్షా 31 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు, అధికార యంత్రాంగాలు లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ లాంటి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.
తాజాగా ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో కూడా నైట్ కర్ఫ్యూ విధించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ రాత్రి నుంచే కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 16 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని తెలిపారు.